గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 30 జూన్ 2018 (15:11 IST)

డేంజర్ జోన్‌లో జమ్మూకాశ్మీర్.. ముంచెత్తుతున్న వరదలు

జమ్మూకాశ్మీర్‌ డేంజర్ జోన్‌లో ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. నిజానికి నిన్నటివరకు కాల్పుల మోతతో ఈ ప్రాంతం దద్ధరిల్లిపోయింది. ఇపుడు భారీ వర్షాలతో వణికిపోతుం

జమ్మూకాశ్మీర్‌ డేంజర్ జోన్‌లో ఉంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. నిజానికి నిన్నటివరకు కాల్పుల మోతతో ఈ ప్రాంతం దద్ధరిల్లిపోయింది. ఇపుడు భారీ వర్షాలతో వణికిపోతుంది. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు.
 
ప్రధానంగా జీలం, తావి పొంగి పొర్లుతున్నాయి. సంగం దగ్గర జీలం నది 23 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. ఉపనదులైన.. వీషా, రాంబీ ఆరా, లిద్దర్ నదుల నుంచి భారీగా వరద నీరు జీలం నదిలోకి చేరుతోంది. శ్రీనగర్ సిటీలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. జమ్మూ ప్రాంతంలోని అనంతనాగ్ జిల్లాలో తావి నదికి వరద నీరు పొటెత్తింది. జమ్మూకశ్మీర్ రీజియన్లలో రికార్డ్ స్థాయిలో వర్షం కురుస్తోంది. 
 
భారీ వర్షాలతో జమ్మూకాశ్మీర్ అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సైన్యం కూడా సహాయ చర్యల్లో పాల్గొంటుంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో కొండ ప్రాంతాల్లోని ఇళ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయించారు.
 
ఇంకోవైపు, ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా అమర్నాథ్‌ యాత్రకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. యాత్రకు బయలుదేరిన సుమారు మూడు వేల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందులో 544 మంది మహిళలు కూడా ఉన్నారు. 
 
భగవతీ నగర్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య యాత్రికులు బయల్దేరాక వర్షం ఉద్ధృతి పెరిగింది. అనేక చోట్ల భద్రతా సిబ్బంది బండరాళ్లను, చెట్లను తొలగించినా యాత్రకు ఆటంకాలు ఎదురవుతూనే ఉండడంతో చాలా చోట్ల వారిని రోడ్లపైనే నిలిపేయాల్సి వచ్చింది.