శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (11:32 IST)

కొండా సురేఖకు హ్యాండిచ్చిన కేసీఆర్.. కారులో సీటు లేదంటూ షాక్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ దంపతులు ఇపుడు ఎవరికీ పనికిరాకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ సారథ్యంలోని తెరాసలో చేరితే అక్కడ ఆ దంపతులకు సరైన గుర్తింపు, గౌరవ మ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ దంపతులు ఇపుడు ఎవరికీ పనికిరాకుండా పోయారు. కాంగ్రెస్ పార్టీని వీడి కేసీఆర్ సారథ్యంలోని తెరాసలో చేరితే అక్కడ ఆ దంపతులకు సరైన గుర్తింపు, గౌరవ మర్యాదలు దక్కలేదు. దీంతో పైగా, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి నిర్వహించే ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వారికి టిక్కెట్లు కేటాయించలేదు. ఫలితంగా వారి రాజకీయ భవితవ్యం ఇపుడు ప్రశ్నార్థకంగా మారింది.
 
వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ కొండా సురేఖ టికెట్‌పై గులాబీబాస్‌ నిర్ణయాన్ని పక్కన పెట్టారు. వరంగల్‌ (తూర్పు), అటు భూపాలపల్లి స్థానాలతోపాటు మరో టికెట్‌ను కూడా తమ కుటుంబానికే ఇవ్వాలని 'ఫ్యామిలీ ప్యాకేజీ' కోరడం వల్లే ఆమె అభ్యర్థిత్వంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక, మేడ్చల్‌లో టీఆర్‌ఎస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వంపై కూడా కేసీఆర్‌ తన నిర్ణయాన్ని పక్కన పెట్టారు.
 
అయితే కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెరాసలో చేరుతున్నారని ప్రచారం ప్రారంభమైంది. కేఎల్‌ఆర్‌ చేరుతున్నారని సుధీర్‌రెడ్డి సభ్యత్వాన్ని పక్కనపెట్టారా? లేక వివాదాల్లో చిక్కుకోవడం వల్లే పెండింగ్‌లో ఉంచారా? అని చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ చింతల కనకారెడ్డి అభ్యర్థిత్వంపై నిర్ణయాన్ని కూడా గులాబీబాస్‌ పెండింగ్‌లో ఉంచారు. పలు వివాదాల్లో ఆయనకు ప్రమేయం ఉండటం వల్లే ఆయనను పక్కన పెట్టాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.