శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (16:29 IST)

ఎవడో కాల్ చేశాడు.. పిల్లాడు యాప్ ఇన్‌స్టాల్ చేశాడు.. అంతే రూ.9లక్షలు స్వాహా!

కరోనా వైరస్ కారణంగా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. పాఠశాలలు తెరుచుకోలేదు. దీంతో ఆన్‌లైన్ క్లాసులు, గేములు అంటూ పిల్లలు స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. దీంతోపాటు ఫోన్‌లలో కొత్త కొత్త యాప్‌లు ఇన్‌స్టాల్ చేయడం.. యాప్‌లను డౌన్లోడ్ చేయడం చేస్తున్నారు. తాజాగా గుర్తు తెలియని కాలర్ నుంచి వచ్చిన సూచనల మేరకు ఒక పిల్లాడు ఫోన్‌లో ఇంస్టాల్ చేసిన యాప్ తండ్రి కొంపముంచింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి 15 ఏళ్ల కుమారుడు తండ్రి ఫోన్ వాడుతున్నాడు. అతనికి తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి తనను తాను డిజిటల్ చెల్లింపు సంస్థకు చెందిన కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌‌గా పరిచయం చేసుకున్నాడు.
 
మొబైల్ ఫోన్‌‌ను మాన్వాట్ బ్యాంక్ ఖాతాతో అనుసంధానిస్తున్నామని, తన తండ్రి డిజిటల్ చెల్లింపు ఖాతా క్రెడిట్ పరిమితిని పెంచే అప్లికేషన్‌‌ను ఇన్‌స్టాల్ చేయమని కాలర్ బాలుడిని కోరాడు. ఆ తర్వాత రూ.9 లక్షలు డ్రా చేసుకున్నాడు. నిందితుడికి మొబైల్ ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ రావడం, డబ్బు మాయం కావడం క్షణాల్లో జరిగాయి. ఇలాంటి మోసాలు జరగకుండా వుండాలంటే.. పరిచయం లేని యాప్‌లకు.. గుర్తు తెలియని కాల్స్‌కు దూరంగా వుండాలి.