శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 నవంబరు 2019 (14:59 IST)

బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్... బీజేపీ దొంగనాటకం బట్టబయలవుతుంది : ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్రపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్ర అన్నారు. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవర్‌ను తమ వైపునకు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా, మహారాష్ట్రలో శనివారం ఉదయం రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం.. బీజేపీ ఎల్పీనేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీఎల్పీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో ఎన్సీపీ-శివసేన ఉమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. బీజేపీ వికృత క్రీడ ఆడుతోందని, దేశం మొత్తం దాన్ని గమనిస్తోందని, పార్టీ ఆడుతున్న నాటకం తప్పకుండా బహిర్గతం అవుతుందని చెప్పారు. 
 
బీజేపీ అన్ని నిబంధనలను అతిక్రమించిందని, అధికారం కోసం పార్టీల మధ్య చీలిక తెస్తోందని ఉద్ధవ్ ఆరోపించారు. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని, హర్యానా, బీహార్‌లోనూ ఇదే చేసిందని ఠాక్రే విమర్శించారు. 
 
పైగా, ప్రజా తీర్పును అవమానించారని మాపై ఆరోపణలు వస్తున్నాయని, కానీ బీజేపీయే ప్రజా ప్రజలను మోసం చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. పాక్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తరహా మహారాష్ట్రలో ప్రజలపై మెరుపుదాడి చేశారని, ప్రజలే బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటారని వ్యాఖ్యానించారు.
 
'శివసేన ఎమ్మెల్యేల్లో కూడా చీలక తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందా? ప్రయత్నించనివ్వండి.. మహారాష్ట్ర ప్రజలు హాయిగా నిద్రపోకుండా చేస్తోందా? చేసుకోనివ్వండి. వారి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొడతాం. అప్పట్లో తనను వెన్నుపోటు పొడవాలని చూసిన వారితో ఛత్రపతి శివాజీ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసు. ఇంతకుముందు బీజేపీ ఈవీఎంలతో ఆట ఆడింది. ఇప్పుడు కొత్త ఆట మొదలు పెట్టింది' అంటూ మండిపడ్డారు.