శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (15:18 IST)

నిర్మలమ్మ నయా రికార్డు.. అర్థాంతరంగా ముగించిన బడ్జెట్ ప్రసంగం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త రికార్డు నెలకొల్పారు. శనివారం లోక్‌సభలో ఆమె 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని ఉదయం 11.03 నిమిషాలకు ప్రారంభించారు. ఆ తర్వాత మొత్తం 2.41 నిమిషాల పాటు సుధీర్ఘంగా తన బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు. 
 
ఆమె ప్రసంగం అప్పటికి కూడా పూర్తికాకపోవడంతో మిగతా బడ్జెట్‌ను సమర్పించినట్టు భావించాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. దీనికి సభాపతి సమ్మతించారు. దీంతో లోక్‌సభ స్పీకర్ అనుమతితో అర్థంతరంగా విత్తమంత్రి నిర్మలా సీతారమన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు.
 
అంతేకాకుండా, ఈమె తన రికార్డును తనే అధికమించారు. 2019-20 సంవత్సరానికిగాను 02 గంటల 17 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమించారు. మొత్తం 2 గంటల 43 నిమిషాల పాటు నిర్విరామంగా ఆమె తన ప్రసంగ పాఠాన్ని కొనసాగించారు. అంటే దాదాపు 26 నిమిషాలు అదనంగా ఈ ఏడాది ఆమె ప్రసంగించారు. 
 
కాగా.. రెండోసారి పార్లమెంటులో బడ్జెట్‌ను నిర్మల ప్రవేశపెట్టారు. మధ్యలో కాశ్మీరీకి సంబంధించిన ఓ కవితను చదివి సభను ఆకట్టుకున్నారు. ప్రతిపక్ష సభ్యులు సైతం ఆమె సుధీర్ఘ ప్రసంగాన్ని శ్రద్ధగా ఆలకించడం విశేషం. ఈ బడ్జెట్ సామాన్య ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటుందని, ఈజ్ ఆఫ్ లివింగ్ పదాన్ని పదేపదే ప్రస్థావించిన నిర్మలా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలను గుర్తుచేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.