ఐపీఎల్ బెట్టింగ్: పార్లమెంట్ మీడియా పార్కింగ్ ఏరియాలో వ్యక్తి సూసైడ్!
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. ఐపీఎల్ బెట్టింగులో పాల్గొని కోట్లాది రూపాయలు నష్టపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పార్లమెంట్కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. పార్లమెంట్కు దగ్గర్లో ఉన్న చెట్టుకు ఆ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టించింది.
అప్పులు బెట్టింగ్కు పాల్పడిన కారణంతోనే అతను మరణించినట్లు పోలీసులు తెలిపారు. పార్లమెంటుకు సమీపంలోని మీడియా పార్కింగ్ ప్రాంతంలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్న ఆ వ్యక్తిని మధ్యప్రదేశ్లోని శివపూర్కి చెందిన 39 ఏళ్ల రాందయాల్ వర్మగా గుర్తించారు. అతని వద్ద 23 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది.
బెట్టింగ్ల ద్వారా కోట్లాది రూపాయలు నష్టపోయానని, అప్పులపాలై గత్యంతరం లేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ నోట్లో పేర్కొన్నాడు.