పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?
పిల్లల కడుపుకు శొంఠి ఎంతో మేలు చేస్తుంది. శొంఠిలో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. శొంఠి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇమ్యూనిటీ పెంచడంతో పాటుగా నొప్పులు, వాపులు నుండి ఉపశమనం కలిగిస్తాయి. పిల్లలకు వారానికి ఒక్కసారైగా ఒక స్పూన్ వరకు శొంఠి పొడిని ఆహారంలో భాగం చేయాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
గోరువెచ్చని నీటిలో ఒక చెంచా శొంఠి పొడి కలిపి పిల్లలకు వారానికి ఒకసారి ఇవ్వడం ద్వారా పిల్లల్లో జీర్ణక్రియ రుగ్మతలు వుండవని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు కూడా దరిచేరవని వారు చెప్తున్నారు. వేడి పాలలో చిటికెడు శొంఠి పొడిని రోజూ వేసి పిల్లలకు తాగిస్తే.. అనారోగ్య సమస్యలుండవు.
అలాగే పెద్దలు ఈ శొంఠి పొడిని ఆహారంలో భాగంగా చేసుకుంటే అది మన శరీరానికి ఊహించని మేలు కలిగిస్తుందని చెబుతున్నారు.. ముఖ్యంగా బరుగు తగ్గాలని ప్రయత్నించే వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుందని అంటున్నారు.
శొంఠి పొడిని అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు. ఇందుకోసం ముందుగా శొంఠిని వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, మెంతులు, వాము, ధనియాలు వేయించుకొని.. అన్ని కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి. ఈ పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే రుచికి రుచి ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు. రోజూ ఒక ముద్ద శొంఠి అన్నం తింటే బరువు తగ్గడం ఖాయమని వారు చెప్తున్నారు.