శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జులై 2020 (13:37 IST)

నో వ్యాక్సిన్... కరోనాతో తిప్పలు తప్పవు : డబ్ల్యూహెచ్ఓ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించేందుకు లేదా ఆ వైరస్ బారినపడుకుండా ఉండేందుకు అవసరమైన మందు (వ్యాక్సిన్) ఈ యేడాది ఆఖరు వరకు వచ్చే అవకాశాలే లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంచేసింది. అంటే.. డిసెంబరు వరకు కరోనాతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది. 
 
నిజానికి కరోనా కట్టడికి అవసరమైన వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు అనేక ప్రపంచ దేశాలన్నీ విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నాయి. ముఖ్యంగా, అమెరికా, భారత్, రష్యా, చైనా, ఫ్రాన్స్‌లతో పాటు.. అనేక దేశాలు ఈ పరిశోధనల్లో తలమునకలైవున్నాయి. అయితే, అమెరికాకు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం - సీరమ్ ఇనిస్టిట్యూట్‌లు సంయుక్తంగా తయారు చేస్తున్న ఇప్పటివరకు మంచి ఫలితాలను ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, భారత్‌కు చెందిన బయోటెక్ కూడా తయారు చేసిన కోవ్యాగ్జిన్ కూడా మంచి ఫలితాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఎంపిక చేసిన కరోనా రోగులపై ప్రయోగిస్తున్నారు. 
 
ముఖ్యంగా, రష్యాలోని సెషనోవ్‌ యూనివర్సిటీ టీకా ఆగస్టులోనే వస్తుందని ప్రచారం జరుగుతోంది. చైనాలో మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయని కథనాలు వస్తున్నాయి. భారత్‌ బయోటెక్ కూడా‌ కోవ్యాగ్జిన్‌ తొలి దశ మానవ ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలోపే వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
 
అయితే, 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఇదే అంశంపై ఆ సంస్థ అత్యవసర విభాగ అధిపతి మైక్‌ ర్యాన్ మీడియాతో మాట్లాడుతూ...‌ ప్రపంచంలోని పలు దేశాల్లో వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, కొన్ని మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయని గుర్తు చేసింది. ఏ ఒక్కటీ విఫలం కాకపోవడం శుభపరిణామమని తెలిపింది. వ్యాక్సిన్‌ వచ్చాక పంపిణీలో ఎలాంటి తారతమ్యాలు ఉండవన్నారు.