బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (16:55 IST)

కాల్ డ్రాప్ సమస్య పరిష్కారం దిశగా టెలికాం కంపెనీలు

ఇటీవల టెలికాం రంగాన్ని కుదిపివేసిన కాల్​ డ్రాప్​ సమస్యను తెరదించే దిశగా మొబైల్​ సర్వీస్​ ప్రొవైడర్లు చర్యలు చేపట్టాయి. వైఫై సాయంతో వాయిస్​ కాల్స్​ మాట్లాడే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించనున్నారు. 'వోవైఫై'గా పిలిచే ఈ సాంకేతికతను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
 
వోవైఫై అంటే?
వోవైఫై పూర్తి పేరు ‘వాయిస్‌ ఓవర్‌ వైఫై’. అంటే వైఫై సహాయంతో వాయిస్‌ కాల్స్​ మాట్లాడటం. మనం ఉన్న ప్రాంతంలో మొబైల్‌ నెట్‌వర్క్‌ కవరేజీ ఎక్కువగా లేకున్నా, సిగ్నల్‌లో పదేపదే హెచ్చుతగ్గులున్నా కాల్‌ మాట్లాడటంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకుగాను ఈ సాంకేతికతను తీసుకొస్తున్నారు. ఆండ్రాయిడ్‌(గూగుల్‌), ఐవోఎస్‌(యాపిల్‌) ఇప్పటికే అమెరికాలో వోవైఫైని అనుమతిస్తున్నాయి.
 
ఎలా పనిచేస్తుంది?
వోవైఫై కోసం ప్రత్యేకంగా యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోనక్కర్లేదు. వైఫై ఉంటే చాలు. మామూలుగా డయల్‌ ప్యాడ్‌ను ఓపెన్‌ చేసి కాల్‌ చేసుకోవచ్చు. నెట్‌వర్క్‌ కవరేజీ బలహీనంగా ఉంటే వోవైఫై ఆధారంగా కాల్‌ కొనసాగుతుంది. మాట స్పష్టంగా వినబడుతుంది.
 
కాల్‌ డ్రాప్‌ ఉండదిక!
సాధారణంగా మొబైల్‌ నెట్‌వర్క్‌ రద్దీగా ఉన్నప్పుడు కాల్‌లు కలవడం ఇబ్బందిగా మారుతుంది. కొన్నిసార్లు కలిసినా వాటంతటవే కట్‌ అవుతుంటాయి. సర్వీస్‌ ప్రొవైడర్లతోపాటు వినియోగదారులకూ తలనొప్పిగా మారిన ఈ కాల్‌ డ్రాప్‌ సమస్య వోవైఫై రాకతో తీరే అవకాశముంది.
 
వాట్సప్‌, స్కైప్‌లతో పనిలేకుండా వైఫై అందుబాటులో ఉన్నప్పుడు ఉచితంగా కాల్‌లు చేసుకునే వెసులుబాటును ప్రస్తుతం వాట్సప్‌, స్కైప్‌, ఫేస్‌బుక్‌, మెసెంజర్‌ వంటి యాప్‌లు కల్పిస్తున్నాయి. 
 
మొబైల్‌ ఆపరేటర్లు వోవైఫైని వినియోగంలోకి తీసుకొస్తే వినియోగదారులు ఆ యాప్‌లలోకి ప్రవేశించకుండా నేరుగా వైఫైతో ఫోన్‌ మాట్లాడొచ్చు.