గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (17:02 IST)

ఆర్టీసీ కార్మికులారా.. ప్రగతి భవన్‌కు రండి... కేసీఆర్ పిలుపు

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ ఒకటో తేదీన ప్రగతి భవన్‌లో సమావేశంకానున్నట్టు తెలిపారు. ఈ మేరకు కార్మికులంతా కదిలి ప్రగతి భవన్‌కు రావాలని పిలుపునిచ్చారు. 
 
ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీని సీఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులుండాలని, అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సిఎం కోరారు. 
 
డిసెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకురావాలని, వారికి ప్రగతి భవన్‌లోనే మద్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సిఎం చెప్పారు. మధ్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాలను కూలంకశంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్‌తో పాటు, ఆర్టీసీ ఎండి, ఇ.డి.లు, ఆర్.ఎం.లు, డివిఎంలను ఆహ్వానించారు.