శుక్రవారం, 6 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 జూన్ 2016 (14:20 IST)

ప్రేమంటే ఇదేరా? కదలలేని స్థితిలో ప్రేయసి.. అంబులెన్స్‌లో తాళికట్టిన ప్రియుడు.. ఎక్కడ?

ప్రేమంటే ఏంటో ఓ జంట నిరూపించింది. చాటింగ్‌లు డేటింగ్‌లంటూ ఫాస్ట్ ఫాస్ట్‌గా వెళ్తున్న నేటి యువతకు ఆ ప్రేమ జంట ఆదర్శంగా నిలిచారు. కాలు జారి కిందపడటంతో వెన్నెముకకు బాగా దెబ్బ తగిలి ప్రేయసి కదలలేని పరిస్థితిలో ఉన్నా ఆ ప్రేమికుడు ప్రేయసిని వదిలిపెట్టలేదు. ఆమె మామూలు మనిషి కావడానికి నెలలు పడుతుందని డాక్టర్లు చెప్పినా.. ఆంబులెన్స్‌లోనే స్ట్రెచర్‌పై పడుకుని వున్న ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన నేత్రావతి నర్సింగ్ చివరి ఏడాది చదువుతోంది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదే ఊరికి చెందిన గురుస్వామిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇరు కుటుంబాల వారు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ దేవనగరిలో మురుగురాజేంద్ర స్వామి అనే పండితుడు నిర్వహించే సామూహిక పెళ్లిళ్లలో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ అనూహ్యంగా పెళ్ళికి పదిరోజుల ముందుగానే నేత్రావతి ఇంట్లో కాలుజారి పడింది. 
 
వెన్నెముకకు దెబ్బతాకడంతో కదలలేని పరిస్థితి ఏర్పడింది. అయినా అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. అంతే అంబులెన్స్‌లో ఆమెను సామూహిక వివాహాలు జరుగుతున్న ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పురోహితుడు మంత్రాలు చదువుతుండగా అంబులెన్స్‌లోనే మూడు ముళ్లు వేయించుకుంది. వీరి నిజమైన ప్రేమను చూసిన అక్కడివారంతా షాక్ తిన్నారు. 
 
తన ప్రేమ గెలిచిన సందర్భంగా నేత్రావతి మాట్లాడుతూ.. తన భర్తకు తాను అన్నివిధాలా మద్దతుగా నిలుస్తానని.. త్వరలో కోలుకుంటానని.. అలాగే తన భర్త కూడా తనకు క్లిష్ట సమయాల్లో ఆదుకోవాలని ఆశించింది. తన వైవాహిక జీవితం జీవితాంతం సంతోషంగా ఉండాలని నేత్రావతి ఆకాంక్షించింది.