1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (07:39 IST)

జమ్మూకాశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాఫ్టర్ - తెలంగాణ టెక్నీషియన్ మృతి

Apache helicopter
ఇండియన్ ఆర్మీకి చెందిన తేలికపాటి హెలికాఫ్టర్ ధృవ్ ప్రమాదమశాత్తు కూలిపోయింది. హెలకాఫ్టర్‌లో సాంకేతి సమస్య తలెత్తడంతో జమ్మూకాశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌ జిల్లా అటవీ ప్రాంతంలో అత్యవసరంగా దించేందుకు ప్రయత్నిస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్‌(29) మృతి చెందగా, ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. 
 
అనిల్‌ తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లావాసి. మరువా నదీతీరాన క్షతగాత్రులను, హెలికాప్టర్‌ శకలాలను గుర్తించారు. ఆర్మీ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల గ్రామాలవారు వీరికి సహకరించారు. గాయపడిన పైలట్‌, కో పైలట్లను ఉధంపుర్‌ ఆసుపత్రికి తరలించినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 
 
ప్రమాద ఘటనపై ఆర్మీ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ధృవ్‌ హెలికాప్టర్లు ప్రమాదాలకు గురవడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. గత మార్చి నెల 8న మన నౌకాదళానికి చెందిన ఏఎల్‌హెచ్‌ ధృవ్‌ ముంబై తీరంలో ప్రమాదానికి గురైంది. అందులోని ముగ్గురు సిబ్బందిని నేవీ పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సాయంతో రక్షించారు. ఈ ఘటన తర్వాత ధృవ్‌ హెలికాప్టర్ల వినియోగాన్ని త్రివిధ దళాల్లో నిలిపివేయగా.. గత సోమవారం నుంచే వాటి సేవలను పునరుద్ధరించారు. మార్చి 16న అరుణాచల్‌ ప్రదేశ్‌లో సైన్యానికి చెందిన ఏవియేషన్‌ చీతా హెలికాప్టర్‌ రోజువారీ శిక్షణలో ఉండగా కుప్పకూలి, ఇద్దరు పైలట్లు మృతిచెందిన విషయం తెలిసిందే.