గురువారం, 26 జూన్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 జూన్ 2025 (12:29 IST)

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

austronuts
భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. విశ్వవినువీధుల్లో దేశ కీర్తిపతాక రెపరెపలాడే మధురఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లమంది భారతీయుల ఆకాంక్షలు, శుభాశీస్సులను గుండెల నిండా నింపుకుని మన వ్యోమగామి శుభాంశు శుక్లా బుధవారం రోదసీలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు ఆస్ట్రోనట్స్ కూడా వెళ్లారు. వీరందరినీ యాక్సియం-4 నింగిలోకి తీసుకెళ్లింది. 
 
ఫ్లోరిడాలోని నాసా కెన్నడి స్పేస్ సెంటరులో భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. నిజానికి ఈ ప్రయోగం మే 29వ తేదీనే చేపట్టాల్సివున్నప్పటికీ వివిధ రకాలైన సాంకేతిక కారణాల కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. 
 
అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ యాక్సియం స్పేస్ ఈ మిషన్‌ను చేపట్టింది. భారత రోదసి పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరక్ష పరిశోధనా సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, స్పెషలిస్టులు టిబర్ కపు, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కి, విస్నియెస్కీ రోదసిలోకి వెళ్ళారు. ఈ ప్రయోగంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 
 
అంతరిక్షంలో ఆయనను శుక్స్‌గా పిలవనున్నారు. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.30 గంటలకు వీరి వ్యోమనౌక ఐఎస్ఎస్‌తో అనుసంధాన అవుతుంది. ఇక్కడ శుభాంశు బృందం మొత్తం 14 రోజుల పాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని మోడీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడి నుంచి ఆయన ముచ్చటిస్తారు.