శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 5 మే 2019 (16:23 IST)

గమ్యస్థానానికి ఆలస్యంగా చేరిన రైలు... నీట్ పరీక్షకు దూరమైన విద్యార్థులు

దేశ వ్యాప్తంగా జాతీయ ప్రవేశ అర్హత పరీక్ష (నీట్) ఆదివారం జరిగింది. అయితే, 200 పైచిలుకు మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. దీనికి కారణం వారు ప్రయాణించిన రైలు గమ్యస్థానానికి ఆలస్యంగా చేరుకోవడమే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బళ్ళారి, హుబ్లి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారుగా 200 పైచిలుకు మంది విద్యార్థులకు నీట్ పరీక్షా కేంద్రాన్ని బెంగుళూరులో కేటాయించారు. ఆదివారం ఉదయం 7 గంటలకు నగారానికి చేరే హంపి ఎక్స్‌ప్రెస్‌ను వీరు ఎక్కారు. ఈ రైలు నిర్ణీత సమయం ఉదయం 7 గంటలకు రావాల్సి ఉండగా, అది మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంది. అంటే దాదాపు 7.30 గంటలు ఆలస్యంగా బెంగళూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. 
 
ఆ తర్వాత విద్యార్థులంతా పరీక్షా కేంద్రమైన దయానంద్‌ సాగర్‌ కాలేజీకి వీరు చేరుకోవాల్సి ఉంది. పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. దీంతో 500 మంది విద్యార్థులు నీట్ పరీక్షను రాయలేకపోయారు. దీంతో వీరంతా సోషల్ మీడియా ద్వారా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి ప్రకాష్ జవదేకర్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయన కూడా స్పదించలేదు. 
 
ఈ వ్యవహారంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రైలు ఆలస్యంపై ఆయన మండిపడ్డారు. ఇతర నేతల విజయాలను తమ గొప్పలుగా చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీగారూ... మీ సహచర కేబినెట్‌ మంత్రుల వైఫల్యాలకు బాధ్యత తీసుకుంటారా అని నిలదీశారు. రైళ్ళు సకాలంలో చేరకపోవడంతో తమ రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు నీట్‌ రాయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు మరోసారి పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ చర్యలు తీసుకోవాలన్నారు.