1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (15:48 IST)

ఢిల్లీలో ముగిసిన జి20 సదస్సు : బాధ్యతలు బ్రెజిల్‌కు అప్పగింత

g20 brezil
ఢిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సు ముగిసింది. తర్వాత బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగించారు. ఈ గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సల్వాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు. ఈ మేరకు అధికారికంగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను అయన చేతికి అందించారు. అనంతరం సదస్సు తీర్మానాలను ప్రధాని మోడీ ప్రకటించారు. 
 
'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు'కు సంబంధించి విజన్‌పై చేస్తోన్న కృషికి జీ20 ఓ వేదికగా మారడంతో నాకెంతో సంతృప్తి లభించింది' అని సదస్సు ముగింపు సందర్భంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. పలు కీలక అంశాలపై కూడా జీ20 బృందం చర్చించిందన్నారు. దీంతో పాటు ఐరాసలో చేపట్టాల్సిన సంస్కరణలపైనా మోడీ మాట్లాడారు. 
 
ఐక్యరాజ్యసమితి సహా అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని భారత ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. సభ్యదేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఐరాస భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యదేశాల సంఖ్య మారడం లేదన్నారు. 51 దేశాలతో ఐక్యరాజ్య సమితి ఏర్పడిన సమయంలో పరిస్థితులు వేరన్న ఆయన.. ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 200కు చేరువైన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా కాలానికి అనుగుణంగా ఎవరైతే మార్పుచెందరో.. వారు ప్రాముఖ్యాన్ని కోల్పోతారని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇక సామాజిక భద్రత, ద్రవ్య, ఆర్థిక స్థిరత్వం వంటి వాటికి తోడు ఈసారి క్రిప్టో కరెన్సీ కొత్త అంశంగా తోడైందని మోదీ అన్నారు. క్రిప్టోను నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.