1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2023 (14:00 IST)

అక్షర్‌ధామ్‌ ఆలయంలో రిషి సునాక్ దంపతుల ప్రత్యేక పూజలు

rishi sunak couple
ఢిల్లీ వేదికగా జరుగుతున్న జి20 సదస్సు జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన భార్య అక్షతా మూర్తిలు అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ దంపతుల రాకను పురస్కరించుకుని ఆలయ పరిస ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసుల గట్టి భద్రతను కల్పించారు. 
 
ఆలయాన్ని సందర్శించనున్నట్లు సునాక్‌ శనివారం సాయంత్రమే మీడియాకు వెల్లడించారు. హిందువుగా తాను గర్విస్తున్నానన్నారు. ఆ సంస్కృతిలోనే తాను పెరిగానని తెలిపారు. తన విశ్వాసాలే ఒత్తిడి సమయంలో తనకు సాంత్వననిస్తాయని వివరించారు. ఇటీవలే రక్షాబంధన్‌ నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. తన చెల్లితో పాటు సమీప బంధువులు తనకు రాఖీలు కట్టినట్లు చెప్పారు. జన్మాష్టమి జరపుకొనేందుకు తనకు సమయం లభించలేదన్నారు.
 
ఆలయ దర్శనం తర్వాత సునాక్‌ మహాత్మా గాంధీ స్మారకం రాజ్‌ఘాట్‌‌కు చేరుకుని జాతిపితకు నివాళులు అర్పించారు. అక్కడ ఆయనకు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. జీ20 సదస్సు నిమిత్తం భారత్‌కు చేరుకున్న దేశాధినేతలందరితో కలిసి సునాక్‌ గాంధీ మహాత్ముడికి నివాళులర్పించనున్నారు. మరోవైపు సునాక్‌తో మోడీ శనివారం ద్వైపాక్షిక చర్చలు జరిపిన విషయం తెలిసిందే. చరిత్రాత్మకంగా నిలిచిపోయే రీతిలో సాధ్యమైనంత త్వరగా 'స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం' (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కలిసి అడుగులు వేయాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు.