దేశ వ్యాప్తంగా 98 స్మార్ట్ సిటీలు.. ఏపీలో మూడు... జాబితా విడుదల చేసిన వెంకయ్య..
దేశ వ్యాప్తంగా స్మార్ట్ సిటీల కోసం ఎంపిక చేసిన నగరాల జాబితాను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గురువారం విడుదల చేశారు. ఆయన ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 98 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయించామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 98 నగరాల్లో 13 కోట్ల జనాభా ఉందని తెలిపారు.
జనాభా అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 13 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామన్నారు. అదే విధంగా తమిళనాడులో 12, మధ్యప్రదేశ్లో 7, గుజరాత్, కర్ణాటక నుంచి 6 నగరాలు, ఏపీలో మూడు, బీహార్లో కూడా 3 స్మార్ట్ నగరాలను ఎంపిక చేయగా, తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ నగరాలను స్మార్ట్ సిటీలుగా ఎంపికైనట్టు వెంకయ్య స్పష్టం చేశారు. అంతేకాకుండా వచ్చే ఆరేళ్ల కాలంలో స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు.
అదేవిధంగా స్మార్ట్ సిటీగా ఎంపికైన ప్రతి నగరానికి ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తామన్నారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులతో స్మార్ట్ సిటీల అభివృద్ధి జరుగుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. కాగా ఏపీలో స్మార్ట్ సిటీలుగా ఎంపికైన కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలు అభివృద్ధి చెందనున్నాయి. కాగా స్మార్ట్ సిటీల పూర్తి జాబితా విడుదల కావాల్సి ఉంది.