శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (21:30 IST)

కరోనా వైరస్ బాధితులు కోలుకోవాలని పూజలు: సాయిదత్తం పీఠంలో అఖండ సాయి చరిత పారాయణం

సాయిదత్త పీఠంలో పూజలు
ఎడిసన్: కరోనా వైరస్ బాధితులు కోలుకోవాలని న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం ఆ సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించింది. అఖండ సాయి చరిత పారాయణం కూడా నిర్వహించి ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా చూడాలని సాయి దత్త పీఠంలో భక్తజనం ప్రార్థించారు. సర్వే జనా సుఖీనోభవంతు అనే సాయినాథుడి సందేశాన్ని భక్తులకు వివరించడంతో పాటు కరోనా వైరస్ బాధితులంతా కోలుకోవాలని ఆ సాయినాధుడిని వేడుకుందామని సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి కోరారు. 
 
కరోనాతో మృతి చెందిన వారికి ఆత్మలకు శాంతి కలగాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. కరోనా నుంచి ఈ ప్రపంచాన్ని రక్షించాలని ఆ సాయిదేవుడిని వేడుకున్నారు. అమెరికాలో కరోనా వ్యాప్తి కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని  న్యూజెర్సీ  పబ్లిక్ యూటిలిటీ బోర్డ్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల అన్నారు. చైనాలో వేయిమందికి పైగా ప్రాణాలను కరోనా కబళించడం.. 45వేల మందికిపైగా ఈ వైరస్ వ్యాప్తి చెందడం దురదృష్టకరమన్నారు. 
ఈ ఊహించని విపత్తుల నుంచి మానవళిని రక్షించేందుకు దైవబలం కూడా అవసరమన్నారు. సాయిదత్త పీఠం సర్వేజనా సుఖీనోభవంతు అనేది ఎప్పుడూ చెబుతుందని దానికి తగ్గట్టే కరోనా బారి నుంచి ప్రపంచాన్ని రక్షించాలని కోరుతూ చేపట్టిన ఈ పూజలు, అఖండ సాయి చరిత పారాయణంలో పాలుపంచుకున్నవారికి ఉపేంద్ర చివుకుల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 
రాబోయే రోజుల్లో, భక్తులు మరియు రిత్విక్ టీం సభ్యుల సహకారంతో రుద్ర పారాయణం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్ర నామ పారాయణం, ధన్వంతరీ మూల మంత్ర జపం వంటి ఎన్నో కార్యక్రమాలను లోక కళ్యాణార్ధం చేయాలని తలపెట్టినట్టు రఘుశర్మ శంకరమంచి తెలియచేసారు.