థామస్-ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో పతకంపై కన్నేసిన సైనా జట్టు
చైనాలోని కున్షాన్ వేదికగా థామస్ ఉబెర్ బ్యాడ్మింటన్ టోర్నీ ఆదివారం నుంచి ప్రారంభంకానుంది. కిందటిసారి కాంస్యంతో చరిత్ర సృష్టించిన సైనా నేతృత్వంలో భారత మహిళల జట్టు ఈ సారి ప్రధాన పతకంపైనే గురిపెట్టి బరిలోకి దిగుతోంది.
నిజానికి భారత మహిళల జట్టు గత 2010లో ఉబెర్కప్ క్వార్టర్ఫైనల్ చేరింది. కానీ, తొలి పతకం (కాంస్యం) గెలిచింది మాత్రం 2014లోనే. ఈసారి 2014 రన్నరప్ జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీలు వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్న జట్టులో ఉన్నప్పటికీ.. ఈ ధఫా మాత్రం పతకం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
ఒక పోరులో మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్లు ఉంటాయి. మూడో సింగిల్స్లో ఆడేందుకు రుత్విక శివాని, తన్వీ లాడ్, పీసీ తులసి మధ్య పోటీ ఉంది. అయినప్పటికీ.. ఈ టోర్నీలో ప్రధాన బాధ్యత సైనా, సింధులపై ఉంది.
రియో ఒలింపిక్స్ అర్హత సాధించిన జంట గుత్తా జ్వాలా, అశ్విని పొన్నప్పలు డబుల్స్లో బరిలోకి దిగనున్నారు. రెండో జంటగా సిక్కి రెడ్డి, మనీషా ఆడతారు. తన తొలి మ్యాచ్లో భారత్ మహిళల జట్టు సోమవారం ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. ఆ తర్వాతి రెండు రోజుల్లో జర్మనీ, జపాన్లను ఎదుర్కొంటుంది.