1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2023 (10:19 IST)

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్టు.. ఆర్టీసీ డ్రైవరుపై ఆటోవాలాల దాడి...

drivers attack
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇది ఆ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల జీవితాలకు శరఘాతంగా మారింది. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటోల్లో ఎక్కే మహిళలే లేకుండా పోయింది. దీంతో తమ జీవనాధారం పోయిందంటూ ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితి చేయిదాటిపోకుండా ఉండేందుకు వీలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లతో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఆటో డ్రైవర్లు శాంతించడం లేదు. 
 
తాజాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కొందరు ఆటో డ్రైవర్లు దాడి చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. ఖమ్మం వైపు వెళుతున్న బస్సు ఒకటి మధ్యాహ్నం కొత్తగూడెం పట్టణంలోని పోస్టాఫీస్ వద్దకు వచ్చి ఆగింది. దీంతో అప్పటివరకు సర్వీసు ఆటోల్లో కూర్చొన్న మహిళలంతా ఆటో దిగిపోయి బస్సులో కూర్చొన్నారు. 
 
ఇదంతా చూసిన ఆవేశానికి గురైన నలుగురు ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్ నాగరాజుపై దాడికి పాల్పడ్డారు. అతడిపై నీళ్లు చల్లుతూ పరుష పదజాలంతో దుర్భాషలాడారు. కండక్టర్‌తో పాటు ఇతర వాహనదారులను వారిని వారించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఈ ఘటనపై కొత్తగూడెం డిపో మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.