సోమవారం, 28 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (14:24 IST)

చిక్కుల్లో కేటీఆర్ బావమరిది ... పోలీసుల నోటీసులు.. హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల

rave party
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌‍హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ అంశం ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతుంది. అది రేవ్ పార్టీ కాదనీ, ఫ్యామిలీ పార్టీ అంటూ బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీపాళీ పేరుతో ఫ్యామిలీ ఫంక్షన్ నిర్వహించారని వారు పేర్కొంటున్నారు. 
 
అయితే, ఈ ఫామ్ హౌస్‌లో పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు.. సోదాలు నిర్వహించగా, రేవ్ పార్టీ సాగుతున్నట్టు గుర్తించారు. పైగా, ఈ ఫామ్ హౌస్ నుంచి భారీ ఎత్తున విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫాంహౌస్‌లో పోలీసులు దాదాపు 21 గంటలు సోదాలు జరిపారు. శనివారం అర్థరాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం రాత్రి వరకు సోదాలు కొనసాగించారు.
 
అలాగే, ఈ పార్టీలో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో రాజ్ పాకాల స్నేహితుడు మద్దూరి విజయ్‌కు పాజటివ్‌గా తేలింది. అతను కొకైన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ పాకాల ఇచ్చినందునే తాను డ్రగ్స్ తీసుకున్నానని అతను పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రాజ్ పాకాలతో తనకు ఐదేళ్లుగా పరిచయం ఉందని, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవోగా ఉన్నానని విజయ్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడు. దీంతో రాజ్ పాకాల, విజయ్‌లపై మోకిల పోలీసులు కేసు నమోదు చేశారు.
 
దీనిపై ఎన్డీపీఎస్ యాక్ట్స్ పాటు గేమింగ్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఈ పార్టీకి 21 మంది పురుషురు, 14 మంది మహిళలు హాజరైనట్టు తెలిపారు. 
 
ఇదిలావుంటే, ఈ పార్టీ వ్యవహారంలో రాజ్ పాకాలకు బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీచేసినట్టు మోకిల పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సోమవారం విచారణకు రావాలంటూ అందులో పేర్కొన్నారు. విచారణకు రాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 
 
విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు. ఆయన అత్యవసరంగా ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని రాజ్ పాకాల కోరారు. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.