సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జులై 2021 (10:43 IST)

హాట్ హాట్‌గా మారిన మునుగోడు పాలిటిక్స్.. జగదీశ్‌ రెడ్డి వర్సెస్‌ కోమటిరెడ్డి

మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రి జగదీశ్‌ రెడ్డి వర్సెస్‌ కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్‌ మద్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అరెస్ట్‌ను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
సీఎం కేసీఆర్‌ పేరు చెప్పుకుని మంత్రి జగదీశ్‌రెడ్డి వేల కోట్లు దండుకున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్‌కు పట్టిన గతే త్వరలో జగదీశ్‌రెడ్డికి పడుతుందన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అయితే.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కౌంటర్‌ అటాక్‌ మొదలెట్టారు మంత్రి జగదీశ్‌రెడ్డి. 
 
కోమటిరెడ్డి బ్రదర్స్‌పై నిప్పులు చెరిగారు. కృష్ణా నదిలో నల్గొండ నీళ్ల వాటాలను అమ్ముకుని డబ్బులు సంపాదించారంటూ అన్నదమ్ములపై ఫైరయ్యారు మంత్రి. తాము కాంగ్రెస్‌ నాయకుల కాదని.. జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డి వాల్ల నోటికి భయపడేది లేదన్నారు. తాను ఇంతవరకూ ఎవరి జోలికి వెళ్లలేదని.. ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్‌రెడ్డి.
 
రేషన్‌కార్డుల పంపిణీ.. మునుగోడులో హీట్‌ పెంచేస్తోంది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి జగదీశ్‌ రెడ్డి కాన్వాయ్‌ను మునుగోడు చౌరస్తాలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట చేసుకుంది. అటు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.