పులి కూనలను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న సావిత్రమ్మ.. తల్లి ప్రేమంటే ఇదేనా? వీడియో వైరల్
బెంగళూరుకు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో బన్నేరుఘట్ట బయోలాజికల్ పార్క్ ఉంటుంది. ఈ జూలులో వన్య ప్రాణాలు చాలా వుంటాయి. ప్రస్తుతం ఇక్కడున్న జంతువుల్లో చాలా వరకూ ప్రాణాపాయ పరిస్థితుల్లో అటవీ సిబ్బంది రెస్క్యూ చేసి తీసుకొచ్చినవే ఉంటున్నాయి.
అలా చిన్నతనంలో తల్లికి దూరమవడం, తల్లి చనిపోవడం లేదా జబ్బు పడడంతో జూ హాస్పిటల్కు తీసుకువచ్చే చిరుత పులులు, సింహాలు, పులులు లాంటి ఎన్నో జంతువుల కూనలకు అమ్మగా మారారు సావిత్రమ్మ. సావిత్రమ్మ కూడా ఇక్కడికి రావడం అనుకోకుండానే జరిగింది.
భర్త చనిపోవడంతో కారుణ్య నియామకం మీద ఆమెకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది. ఆమె ఉద్యోగంలో చేరినప్పటి నుంచి జూ ఆఫీసును శుభ్రపరుస్తూ.. అక్కడ జంతువులను ప్రేమగా చూసుకునేవారు. 2002లో మొదటిసారి ఉద్యోగం వచ్చినపుడు పార్కును శుభ్రపరిచే ఉద్యోగుల్లో ఒకరిగా సావిత్రమ్మ చేరారు. ఆ తర్వాత త్వరగానే అక్కడి జంతువులకు ఇష్టమైన వ్యక్తిగా మారిపోయారు. దీంతో, కొన్ని రోజులకే ఆమెను కేర్ టేకర్గా జూ హాస్పిటల్కు మార్చారు.
పొద్దునే ఆఫీసును క్లీన్ చేసి తర్వాత పులి కూనల వద్దకు వెళ్లి వాటి బట్టలు, బెడ్డు మార్చి సిద్ధం చేస్తాను. పిల్లలకి పాలు కాస్తానని ఆమె చెప్తోంది. ఇక్కడున్న కేజ్ అంతా శుభ్రంగా కడిగి వాటికి నీళ్లు పెట్టాలి. అప్పుడే పుట్టిన పిల్లలు, ఒకరోజు పిల్లలూ వస్తాయి. సింహం, చిరుత, పులి, జింకలు అన్నీ తీసుకొస్తారు.
వాటిని సరిగ్గా చూసుకుని పెద్ద అయ్యేవరకూ పెంచి సఫారీలో వదులుతామని సావిత్రమ్మ తెలిపారు. దాదాపు పాతికేళ్ల నుంచీ కేర్ టేకర్గా పనిచేస్తున్నాననీ, ఎప్పుడూ క్రూరమృగాల వల్ల తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు సావిత్రమ్మ.
ఇంట్లో చిన్న పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో జంతువుల పిల్లలను అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటామని ఆమె చెప్పారు. ఈమెను చూడగానే ఆ పులి కూనలు ఎంత ప్రేమగా ఆమె వద్దకు వెళ్తాయో చెప్పే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.