శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (09:03 IST)

దళారీ వ్యవస్థ నియంత్రణకే చేపల చెరువుల వేలం: మంత్రి అప్పలరాజు

రాష్ట్రంలో పలు చేపల చెరువులు దళారీల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని, అటు వంటి చేపల చెరువులకు దళారీ వ్యవస్థ నుండి విముక్తి కలిగించి మత్స్యకారులకు నిఖరమైన ఆదాయాన్ని కల్పించాలనే లక్ష్యంతోనే చేపల చెరువుల వేలానికి కార్యాచరణ మార్గదర్శకాలతో జి.ఓ.ఆర్టి.నెం.217 ను జారీచేయడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ది, మత్స్య శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. 

ఈ జి.ఓ. పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతాన్ని చేస్తూ మత్స్యకారుల్లో అయోమయాన్ని సృష్లిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వంద హెక్టార్ల విస్తీర్ణానికి పైబడి సుమారు 582 చెరువులు ఉన్నాయని, అందులో 333 చెరువులను మాత్రమే వేలం వేసేందుకు ప్రతిపాదించడం జరిగిందన్నారు. అయితే తొలుత నెల్లూరు జిల్లాలోగల 88 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులలో 27 ట్యాంకుల్లో మాత్రమే పైలెట్ ప్రాజక్టుగా ఈ వేలం విదానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుని తదుపరి చర్యలు చేపడతామన్నారు. ప్రతి చెరువు వేలం ద్వారా  వచ్చే ఆదాయంలో 30 శాతం సొమ్మును సంబందిత ప్రాథమిక మత్స్యకార సహకార సొసైటీకే కేటాయించడం జరుగుతుంద‌న్నారు. మత్స్యకార సొసైటీలోని ప్రతి సభ్యునికి సాలీనా కనీసం నిఖర ఆదాయం రూ.15 వేలు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ విదానానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

మిగిలిన 70 శాతం ఆదాయంలో 10 శాతం సంబందిత గ్రామ పంచాయితీకి, 20 శాతం ఆప్కాకాఫ్ కు మిగిలిన 40 శాతం జలవనరుల శాఖకు అందజేయడం జరుగుతుందన్నారు.  ఈ ఆదాయంతో ఆయా శాఖలు, సంస్థలు మత్స్యకార సంక్షేమానికి, చేపల చెరువుల అభివృద్దికి, మౌలిక వసతుల కల్పనకు తగు చర్యలు తీసుకునేందుకు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. అంతేకానీ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నట్లుగా మత్స్యకారులకు ఎటు వంటి హానీ, నష్టం జరుగబోదని మంత్రి స్పష్టంచేశారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మత్స్యకార సంక్షేమానికి పలు పథకాలు అమలు చేయడం జరుగుచున్నదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో కేవలం  విశాఖపట్నం, కాకినాడల్లో మాత్రమే పోర్టులు ఉన్నాయని, అయితే తదుపరి నాలుగు పోర్టుల నిర్మాణానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మరో నాలుగు పోర్టుల నిర్మాణానికి ఒకటి రెండు మాసాల్లో  శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

మిగిలినవి భవిష్యత్తులో చేపడతామని ఆయన తెలిపారు. ఆక్వారంగానికి విద్యుత్ రాయితీ ఇవ్వబట్టే కోవిడ్ వంటి విషమ పరిస్థితుల్లో కూడా ఆ రంగం నిలద్రొక్కుకో గలిగిందన్నారు. చేపలకు,రొయ్యలకు కనీస మద్దతు  ధర కల్పించి రైతులను నష్టాల నుండి కాపాడగలిగామన్నారు.  వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద బి.సి., ఎస్.సి., ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 సంవత్సరాలు నిండిన మహిళలకు  నాలుగు సంవత్సరాల్లో రూ.75 వేల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.

ఇందుకు ఏడాదికి సుమారు రూ.4,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని, అందులో బాగంగానే 100 హెక్టార్ల విస్తీర్ణం పైబడిన చేపల చెరువుల వేలానికి ప్రతిపాదించడం జరిగిందనే విషయాన్ని మత్సకారులు అందరూ గుర్తించాలన ఆయన విజ్ఞప్తిచేశారు.