గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 జులై 2019 (15:47 IST)

నవరత్నాల పేరిట నయవంచన... తెదేపా నేత తాతయ్య

నవరత్నాల పేరుతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నయవంచన చేస్తున్నారంటూ జగ్గయ్యపేట తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం తన వివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు వైకాపా అధ్యక్షులు జగన్ ఆపార్టీ నాయకులు ఊరూరా తిరిగి నవరత్నాలు అంటూ ప్రజలకు నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ రత్నాలకు కోతలు విధిస్తున్నారు. 
 
ఇదేంటి ప్రజల తరుపున ప్రశ్నించిన తెదేపా శాసనసభ్యుల గొంతు నొక్కుతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరిన శాసన సభ్యులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను సస్పెండ్ చేయటం అప్రజాస్వామికం. ఇచ్చిన హామీలు అమలు చేయమని న్యాయబద్ధంగా శాసనసభ్యులు కోరితే శాసనసభ నుంచి సస్పెండ్ చేయటం దేశచరిత్రలో ఇదే ప్రథమం అని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. 
 
 
పెన్షన్‌ల పెంపు నుంచి రైతు భరోసా వరకు సున్నా వడ్డీ నుంచి డ్వాక్రా రుణమాఫీ వరకు అన్నింటిలోనూ ముఖ్యమంత్రి జగన్ మాటమార్చి మడిమ తిప్పుతూ 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఫించను ఇస్తామని జగన్ ప్రతీ రోజు పాదయాత్రలో చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ హామీని తుంగలో తొక్కి వారిని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జరుగుతున్న మోసంపై ప్రజల తరుపున ప్రశించిన ముగ్గురు తెదేపా సభ్యులను సస్పెండ్ చేయటం ఏంటి ఇది ప్రజాస్వామ్యమా లేక పులివెందుల స్వామ్యమా అని నిలదీశారు. దేశానికి ఆదర్శంగా సభను నడుపుతాం అని స్పీకర్ తన ప్రమాణ స్వీకారం నాడు చెప్పారు అంటే ప్రజాగళం వినిపించిన వారిని సస్పెండ్ చేయటమే దేశానికి ఆదర్శమా అంటూ ప్రశ్నించారు. 
 
అసెంబ్లీలో ప్రజాఆకాంక్షలు బలంగా వినుపిస్తున్న 23 మంది తెదేపా శాసనసభ్యుల గొంతు నొక్కగలరేమోగానీ, ఐదు కోట్ల ఆంధ్రుల గొంతు నొక్కలేరన్నారు. ఎన్నికలకు ముందు నవరత్నాలను నమ్మ బలికారు, కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క రత్నమైనా సరిగా అమలు చేశారా? రైతు భరోసా కింద ఏటా రూ.12,500 ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు మాత్రం రూ.6,500 మాత్రమే ఇస్తామని రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 
 
నవరత్నాల ప్రచారానికి ఇచ్చిన ప్రాధాన్యతలో నూరో వంతు కూడా అమలుపై చూపటం లేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తానంటూ అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటనలో బాంగంగా గొంతు చించుకొని మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి అమలు విషయంలో ఎందుకు మడిమ తిప్పారు. పెన్షన్ రూ.3 వేలు చేస్తామని చెప్పి చివరకు రూ.250 మాత్రమే పెంచి వయోవృద్దుల ఆశాలపైన నీళ్ళు చల్లారు ఇప్పటివరకు మహిళలకు అందిస్తామని చెప్పిన రూ.75,000 వేలు గురించి మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించలేదన్నారు. 
 
ఇప్పటివరకు ముఖ్యమంత్రి సమీక్షలలో కూడా ఎక్కడ ప్రస్తావించని దాఖాలు లేవు. అమ్మ ఒడి ఎల్కేజీ నుంచి బడికి పంపే ప్రతీ తల్లికి రూ.15 వేలు ఇస్తామని పాదయాత్రలో జగన్ ప్రకటించారు. కానీ ఇప్పుడు అమ్మ ఒడి పథకం క్రింద ఒకట నుంచి ఇంటర్మీడియట్ వరకు బడికి పంపే పిల్లల తల్లికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది.
 
విద్యాశాఖ లెక్కల ప్రకారం ఒకటి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో 70 లక్షల మంది, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు 10 లక్షల మంది ఉన్నారన్నారు. వీరందరికీ అమ్మఒడి పథకం అమలు చేయాలని కోరారు.