శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (15:33 IST)

లోకేశ్ టెన్త్ క్లాస్ ఎలా పాసయ్యాడో చెప్పమంటారా? నార్నే శ్రీనివాసరావు

టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్ పదో తరగతి ఎలా పాస్ అయ్యాడో తనకు బాగా తెలుసని వైకాపా నేత నార్నే శ్రీనివాస రావు చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ పదో తరగతి పాస్‌ కావడానికి ఏం చేశాడో నాకు తెలుసు. లోకేశ్‌ పాసయ్యేందుకు మంత్రి నారాయణ ఎలా సహకరించాడో కూడా తెలుసు. అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు ఎంత ముట్టచెబుతున్నాడో కూడా తెలుసు. చంద్రబాబు తన పాల డెయిరీని నిలబెట్టుకోవడానికి మిగతావారిని ఎలా నాశనం చేశాడో తెలుసు. ఏపీ ప్రజలను కోరుకుంటున్న చంద్రబాబు నమ్మొద్దు. చంద్రబాబు కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన వ్యక్తి. మళ్లీ కాంగ్రెస్‌కే టీడీపీని తాకట్టు పెడతాడు. ఒకసారి ప్యాకేజీ అని, ఇంకోసారి ప్రత్యేక హోదా అని పూటకో మాట మారుస్తున్నాడు అంటూ ధ్వజమెత్తారు. 
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని రాష్ట్రానికి అద్భుతమైన ముఖ్యమంత్రిని అందించబోతున్నామన్నారు. వైఎస్‌ జగన్‌ వల్లే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నార్నే స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ బీసీలకు కూడా పెద్దపీట వేశారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌, వైఎస్సార్ మాదిరి సుపరిపాలన చేస్తారని అన్నారు.
 
'చంద్రబాబు పచ్చి మోసగాడు. సొంత తమ్ముడికే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశాడు. తమ్ముడిని గొలుసులతో కట్టేసి పిచ్చి పట్టేలా చేశాడు. దమ్ముంటే రామ్మూర్తినాయుడు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాడో చూపించాలి. తమ్ముడి పరిస్థితి అలా కావడానికి బాబే కారణం. చంద్రగిరిలో ఓటింగ్‌ పెడితే చంద్రబాబు మీద రామ్మూర్తినాయుడే గెలుస్తాడు. అందుకే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నాడు. అలాగే తిరుపతిలో చంద్రబాబు సొంత సోదరికి ప్రమాదం జరిగినా, ఇంతవరకూ ఆమెను ఎవరూ పరామర్శించలేదు. తోడబుట్టిన చెల్లిని చూడని చంద్రబాబు ఏపీ చెల్లెమ్మలను ఎలా చూసుకుంటాడు?' అని నార్నే శ్రీనివాసరావు నిలదీశారు.