శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 మే 2024 (07:50 IST)

పల్నాడు జిల్లా రెంటాలలో టీడీపీ ఏజెంట్లపై దాడి... ఈసీ సీరియస్

tdp agent injured
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఏజెంట్లపై వైకాపా వర్గీయులు భౌతికదాడులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం 7 గంటలకే ఏపీలో పోలింగ్ ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆరు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఉదయం ఏడు గంటల నుంచి అధికారులు ఓటింగ్ ప్రక్రియను ప్రారభించారు. 
 
ఈ పరిస్థితుల్లో పల్నాడు జిల్లా రెంట చింతల మండలం రెంటాలలో ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏజెంట్లపై అధికార వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరు ఏజెంట్లను అధికారులు అనుమతించారు. మాక్‌ పోలింగ్‌ పూర్తయిన తర్వాత.. రెగ్యులర్‌ పోలింగ్‌ ప్రారంభిస్తున్న క్రమంలో వైకాపా ఏజెంట్లు తెదేపా ఏజెంట్లపై దాడి చేశారు. 
 
మరోవైపు, ఈ దాడి ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలింగ్‌ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలపై కన్నెర్రజేసింది. తక్షణం పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే అదనపు బలగాలను తరలించి సమస్యాత్మక ప్రాంతాల్లో మొహరించేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది.