1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 19 మే 2020 (05:24 IST)

జూన్-10న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు 10 వేలు : నాని

అర్హులందరికీ ‘వాహన మిత్ర’ పథకం ద్వారా రూ.10 వేలు అందజేస్తామని రవాణా శాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. సోమవారం నాడు విజయవాడలో ఏర్పాటు చేసిన వాహన మిత్ర కార్యక్రమంలో నాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించారు. సీఎం ఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సొంత ఆటో, ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేస్తున్నామన్నారు.

జూన్‌ 4న రెండో ఏడాది వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర ఆర్థికసాయం విడుదల చేస్తామని మంత్రి స్పష్టంచేశారు. కాగా.. గతేడాది అక్టోబర్‌లో ఈ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అట్టహాసంగా ప్రారంభించిన విషయం విదితమే. 

26లోపు దరఖాస్తు చేస్కోండి..
‘ఈ ఏడాది కూడా లబ్ధిదారులకు డబ్బులు అందజేస్తాం. కొత్తగా ఎవరైనా ఆటో, ట్యాక్సీ కొనుగోలు చేసుంటే ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. వాహనమిత్ర ఇంటికొకరికి మాత్రమే వర్తిస్తుంది. ఒకే ఇంట్లో ఒకరిపై ఆటో ఉండి, మరొకరికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది.

గత ఏడాది ఆర్థిక సాయం పొందిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వారి అర్హతలను గ్రామ సచివాలయ సిబ్బంది సోషల్ ఆడిట్ చేసి అర్హులను నిర్ణయిస్తారు’ అని మంత్రి నాని ఈ సందర్భంగా సూచించారు.

తొలగించలేదు.. నిరూపిస్తే క్షమాపణ
‘బస్సులు తిప్పడంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బస్సులు తిప్పడంపై స్టేట్ లెవెల్ టాస్క్ ఫోర్స్‌పై సీఎం చర్చిస్తున్నారు. బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్దంగా ఉంది. ప్రభుత్వం అనుమతిస్తే  24గంటల్లో బస్సు సర్వీసులు ప్రారంభిస్తాం. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదు. ఎక్కడైనా నేను చెప్పిన దానికి విరుద్దంగా జరిగిందని నిరూపిస్తే నేను క్షమాపణ చెబుతాను.

ఆర్థిక సమస్యలతోనే అవుట్ సోర్సింగ్ వారికి వేతనాలు చెల్లించలేదు. ప్రజల సౌకర్యార్థం ప్రజారవాణాపై ప్రభుత్వం యోచన చేస్తోంది. నేడో, రేపో ఈ అంశంపై జగన్ నుంచి సుస్పష్టమైన ఆదేశాలొచ్చే ఛాన్స్ ఉంది. ప్రయాణికుల కోసం ఏపీఎస్ ఆర్టీసీ బస్‌లు నడిపేలా చర్యలు తీసుకుంటాం. ప్రజారోగ్యరీత్యా బస్ సీట్ల విధానంలో మార్పులు, చేర్పులు చేశామన్నారు.

ప్రయాణికుల మీద చార్జీల భారం ఉండవు. కోవిడ్-19 ఎఫెక్ట్ లేకుండా నిబంధనల మేరకే బస్‌లు నడిపేలా చొరవ తీసుకుంటాం. ఏపీలో ఉండే వలస కార్మికులు వారి స్వస్థలాలకు, గమ్యస్థానాలకు చేర్చేలా ఆర్టీసీ ప్రత్యేక బస్‌ల ద్వారా చేరుస్తున్నాం’ అని మంత్రి తెలిపారు.