1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (08:37 IST)

కొలిమిగుండ్లలో 4వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రం

క‌ర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఎస్ఇసిఐ సంస్థ ముందుకొచ్చింద‌ని అందుకు అవ‌స‌ర‌మైన భూమిని కేటాయింపు అంశంపై ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తుంద‌ని ఏపి సీఎస్ నీలం సాహ్ని కేబినెట్ కార్య‌ద‌ర్శి రాజీవ్ గౌబ‌కు వివ‌రించారు.

రెన్యువల్ ఎనర్జీకి సంబంధించి అంతర్ రాష్ట్ర ట్రాన్స్ మిషన్ సిస్టమ్ ఏర్పాటు అంశంపై గురువారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం (వీసీ) నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలల్లో రెన్యువల్ ఎనర్జీ కింద సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న, ప్రతిపాదించిన ప్రాజెక్టుల ప్రగతిని అందుకు అవసరమైన భూసేకరణ ఇతర అంశాలపై సిఎస్‌లతో ఆయన సమీక్షించారు.

ప్రతిపాదించిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఈ సంద‌ర్భంగా వీడియో సమావేశంలో పాల్గొన్న ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ కారిడార్ మొదటి, ద్వితీయ దశల కింద చేపట్టిన ప్రాజెక్టులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని కేబినెట్ కార్యదర్శికి వివరించారు.

అదే విధంగా సోలార్ ఎవాక్యుయేషన్ స్కీమ్‌లో భాగంగా ఇప్పటికే కర్నూల్ జిల్లా గని వద్ద ఏర్పాటు చేసిన 1000 మెగావాట్ల సోలార్ పార్కు, తలారి చెరువు వద్ద ఏర్పాటు చేసిన 500 మెగావాట్ల సోలార్ పవర్ పార్కులు పూర్తై ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్తత్తి చేస్తున్నాయని తెలిపారు. కడప జిల్లాలో ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్కుకు సంబంధించి వారం రోజుల్లోగా అందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్ వివరించారు.

అలాగే కర్నూల్ జిల్లా కొలిమిగుండ్ల మండలంలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఎస్ఇసిఐ సంస్థ ముందుకు రాగా అందుకు అవసరమైన భూమిని కేటాయించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబకు వివరించారు. వీడియో సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ పాల్గొన్నారు.