శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2019 (12:04 IST)

తెలంగాణాలో ప్రజారవాణా అస్తవ్యస్తం.. ఆగిన ఆర్టీసీ చక్రాలు... ఇపుడు ప్రైవేట్ క్యాబ్‌లు కూడా...

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా అస్తవ్యస్తంగా మారిపోయింది. గత 14 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మెను విరవించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం కూడా వారి డిమాండ్ల పరిష్కారం కోసం ఏమాత్రం చొరవచూపడంలేదు. దీంతో ఆర్టీసీ బస్సుల సమ్మె యధావిధిగా కొనసాగుతోంది. 
 
ఈ ఆర్టీసీ సమ్మెతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దీనికితోడు శనివారం నుంచి మరో షాక్ తగలింది. ఆర్టీసీ సమ్మె బాట పట్టినట్లే క్యాబ్ డ్రైవర్లు కూడా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ నెల 19 అనగా రేపటి నుంచి నగరంలోని ఉబర్, ఓలా, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న దాదాపు 50 వేల క్యాబ్‌లు సమ్మెలో పాల్గొనబోతున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్‌ ఐకాస ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ప్రకటించారు. 
 
కిలోమీటరుకు కనీసం రూ.22 చేయాలన్న డిమాండ్‌తో సమ్మె చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా క్యాబ్ డ్రైవర్లకు మినిమమ్ బిజినెస్ గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లకు జీవో నెం.61, 66 అమలు చేయాలని.. డ్రైవర్లపై దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీ తప్పనిసరి చేయాలని కోరారు. అంతేకాదు ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.