గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (10:12 IST)

మద్యం బంద్ : శానిటైజర్ తాగి 8 మంది మృత్యువాత.. ఎక్కడ?

కరోనా వైరస్ కారణంగా అనేక ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఇలాంటి ప్రాంతాల్లో మద్యం విక్రయాలు నిలిపివేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో నివసించే తాగుబోతులు... మద్యం కోసం అర్రులు చాస్తున్నారు. మద్యానికి బానిసలైన కొందరు ఇతర మార్గాల్లో మత్తులో జోగుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి ఏకంగా 8 మంది మృత్యువాతపడ్డారు. మద్యానికి ప్రత్యామ్నాయంగా కొందరు శానిటైజర్ తాగితే.. మరికొందరు నాటు సారాలో శానిటైజర్ కలుపుకుని సేవించడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లాలోని కురిచేడు అమ్మవారి ఆలయం వద్ద బిక్షమెత్తుకునే ఇద్దరు యాచకులు మద్యానికి బానిసయ్యారు. అయితే, మద్యం ధరలు పెరగడంతో ప్రత్యామ్నాయంగా గత కొన్ని రోజులుగా శానిటైజర్ తాగుతున్నారు. 
 
వీరిలో ఒకరు గురువారం రాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో చనిపోగా, మరో వ్యక్తి కూడా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే అతడిని దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.  
 
మరో ఘటనలో కురిచేడు పోలీస్ స్టేషన్ సమీపంలో నివసించే రమణయ్య గురువారం ఉదయం నాటుసారాలో శానిటైజర్ కలిపి తాగి ఇంటికెళ్లి కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని దర్శి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
కాగా, శానిటైజర్ తాగి అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఐదుగురు శుక్రవారం మరణించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.