మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 3 నవంబరు 2020 (21:39 IST)

లక్ష జీతమిప్పిస్తానని యువతిని ఎత్తుకెళ్ళిన ఇద్దరు బిడ్డల తండ్రి, యువతి ఫోన్ స్విచాఫ్

అతనికి వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఫోన్లో అమ్మాయిలను పరిచయం చేసుకోవడం.. వారికి ఉద్యోగం తీసిస్తానని మాయమాటలు చెప్పడం..వారిని లోబరుచుకోవడం ఇదే అతని పని. ఇప్పటికే ఇద్దరు యువతులను మోసం చేసి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. మళ్ళీ మరో యువతిని మోసం చేసి ఎత్తుకెళ్ళి ఇంతవరకు కనిపించకుండా పోయాడు. 
 
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శివశంకర్.. అహోబిలం గ్రామానికి చెందిన జ్యోతి అనే అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఉద్యోగం వెతుకుతున్న జ్యోతి, శివశంకర్ మాయమాటలకు ఈజీగా పడిపోయింది. కరోనా ముందు నుంచి వీరిద్దరి మధ్య మాటలు సాగాయి.
 
అయితే కాస్త కుదుటపడిన తరువాత బెంగుళూరుకు తీసుకెళ్ళి లక్ష రూపాయలు జీతం వచ్చే ఉద్యోగం తీసిస్తానన్నాడు. చెప్పినట్లుగానే గత నెల 26వ తేదీన జ్యోతిని కడపకు రమ్మన్నాడు. అతడిని నమ్మి వెళ్ళిన జ్యోతి ఇంతవరకు కనిపించలేదు. 
 
తనకు ఉద్యోగం తీసిస్తానని శివశంకర్ చెప్పాడని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళింది జ్యోతి. గత రెండు రోజుల నుంచి జ్యోతి సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులను ఆశ్రయించారు. 
 
అయితే శివశంకర్ గురించి పోలీసులు విచారించగా ఇద్దరు పిల్లల తండ్రిగా తెలియడమే కాకుండా గతంలో ఇద్దరు యువతులను ఇదే విధంగా మోసం చేసినట్లు కూడా నిర్థారణ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళకు గురవుతున్నారు. శివశంకర్‌ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.