గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 సెప్టెంబరు 2022 (09:24 IST)

పామును పట్టేందుకు వెళ్లి ప్రాణం విడిచిన అర్చకుడు.. ఎక్కడ?

priest - snake
ఓ ఇంట్ల దాగిన పామును పట్టేందుకు వెళ్లిన ఓ పూజారి చివరకు ఆ పాము కాటు వేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాకర ఘటన కృష్ణా జిల్లా కృత్తివెన్ను గుడిదిబ్బ అనే గ్రామంలో జరిగింది.  తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కృత్తివెన్ను గుడిదిబ్బ గ్రామానికి చెందిన కొండూరి నాగబాబు శర్మ (48) తండ్రి నుంచి వచ్చిన పౌరోహిత్యాన్ని వారసత్వంగా చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన గత కొంతకాలంగా హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. 
 
దసరా సందర్భంగా కృత్తివెన్నుకు వచ్చారు. గ్రామాల్లో కనిపించే పాములను పట్టుకుని నివాసాలకు దూరంగా వదిలివేసే అలవాటు ఉండటంతో కృత్తివెన్ను పీతలావ గ్రామానికి చెందిన రైతులు కొండూరు నాగబాబుశర్మను శనివారం మధ్యాహ్నం పామును పట్టుకోవడానికి తీసుకు వెళ్లారు.
 
పట్టుకున్న పామును నివాసాలకు దూరంగా తరలించే సమయంలో చేతిపై కాటువేయడంతో ఆయన ఇంటివద్దే ప్రథమ చికిత్స చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొంతసేపటికి పరిస్థితి విషమించడంతో సమీపంలోని చినపాండ్రాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితిని గమనించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకువెళ్లాలని సూచించారు. 
 
దీంతో కుటుంబ సభ్యులు సొంతకారులో మచిలీపట్నంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగానే మరణించారు. ఎంతోమందికి పాముకాటు బారినుంచి రక్షించిన ఆయన అదే పాము కాటుతో చనిపోవడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
ఆదివారం స్థానికులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు నాగబాబుశర్మ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మధ్యాహ్నం గుడిదిబ్బలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.