1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (19:11 IST)

ఎర్రగొండపాలెంలో వైకాపా శ్రేణుల ఆందోళన.. చంద్రబాబుకు అదనపు భద్రత

chandrababu
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో వైకాపా శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అదనపు భద్రత కల్పించారు. ఈ జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే ప్రచార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు వచ్చే మార్గంలో వైకాపా నేతలు ప్లకార్డులు, నల్లజెండాలతో రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. 
 
గతంలో తెదేపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ దళితులను కించపరిచేలా వ్యాఖ్యానించారని, దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైకాపా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే ఎర్రగొండ పాలెంలో అడుగుపెట్టనీయబోమని మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 
 
దీనిని అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. వైకాపా కార్యకర్తల నిరసనలతో ఎన్‌ఎస్‌జీ అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రత కోసం అదనపు సిబ్బందిని రప్పించారు. ప్రస్తుతం మార్కాపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు..  ఎర్రగొండపాలెంలో రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలో మాట్లాడుతారు.