శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:46 IST)

తెలుగుదేశాన్ని నిలబెట్టేది పసుపు - కుంకుమ పథకమే : జేసీ దివాకర్ రెడ్డి

వచ్చే నెల 23వ తేదీన వెల్లడయ్యే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే అది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం వల్లే అవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తాము గెలువబోతున్నామన్నారు. ఆ గెలుపు కేవలం పసుపు కుంకుమ, వృద్ధాప్య పింఛన్ల వల్లేనని ఆయన చెప్పారు. 
 
సీఎం హోదాలో చంద్రబాబు గత ఐదేళ్ళ కాలంలో 120 పథకాలు ప్రవేశపెట్టారన్నారు. 'రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు నదుల అనుసంధానం చేశారు. రైతు బాగుపడాలని చాలా శ్రమించారు. అప్పు, సప్పూ చేసి.. కాళ్లు పట్టుకున్నారు.. జుత్తు పట్టుకున్నారు. ఇంతలా రైతుల కోసం ఆయన శ్రమిస్తే ఒక్కడైనా ఆయనను అభినందించాడా? ఎందుకు చెయ్యాలి? ఏం అవసరముంది.. ఈ సంక్షేమ కార్యక్రమాల్లో? కూడు, బట్ట పెట్టాయా? నేను నిజం చెబుతున్నా.. మా తెలుగుదేశాన్ని నిలబెట్టేది.. కేవలం పసుపు - కుంకుమ, ముసలోళ్లకిచ్చే పింఛన్లు. ఈ రెండు లేకపోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియాలి' అని జేసీ వ్యాఖ్యానించారు.