శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జనవరి 2020 (13:23 IST)

రాయలసీమ ద్రోహి ఎమ్మెల్యే బాలకృష్ణ - హీరోకు చేదు అనుభవం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉధృతంగా ఉద్యమం సాగుతోంది. ఈ ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ఆ పార్టీ తరపున అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న సినీ నటుడు బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. రాయలసీమ ద్రోహి అంటూ వైకాపా కార్యకర్తలు, నేతలు నినాదాలు చేస్తూ బాలయ్య కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. 
 
తన సొంత నియోజకవర్గంలో ఆయన గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న స్థానికులు... అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
రాయలసీమలో హైకోర్టును బాలకృష్ణ అడ్డుకుంటున్నారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు గుప్పించారు. ఆయనను రాయలసీమ ద్రోహి అంట, వెనక్కి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణకు మద్దతుగా నిలిచారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
 
కాగా, గత కొన్ని రోజులుగా రాజధాని కోసం తమ భూములు ఉచితంగా ఇచ్చిన రైతులు గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళన చేస్తున్న రైతులకు వైకాపా మినహా మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించారు.