1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (11:03 IST)

వైకాపా జెండా దించాలన్న టీడీపీ కార్యకర్త .. బట్టలూడదీసి నగ్నంగా తిప్పిన పోలీసులు... ఎక్కడ?

appolice
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులు అధికార పార్టీకి చెంచాగిరి చేస్తున్నారనే విమర్శలు బాహాటంగానే వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు చెప్పినట్టుగా నడుచుకుంటూ విపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు దాడి చేసినా, హత్యలు చేసినప్పటికీ పోలీసుల కళ్లకు కనిపించడం లేదు. పైగా, వైకాపా నేతల దుశ్చర్యలకు పోలీసులు అండగా నిలుస్తూ వారిని మరింతగా ప్రోత్సహిస్తున్నారు. అందుకే వైకాపా నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా వైకాపా జెండా దించాలన్నందుకు ఓ టీడీపీ కార్యకర్త బట్టలు విప్పించి నగ్నంగా పోలీసులే తిప్పారు. అంతేనా. అతన్ని బూటు కాళ్లతో తన్నారు. ఈ అవమానకర ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ పాల్లూరు స్టేషన్ పోలీసులు చీకలగురికి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చంద్రమోహన్‌ను దుస్తులు ఊడదీయించి, బూటుకాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ స్టేషన్ ఆవరణలో నగ్నంగా తిప్పారు. వైసీపీ జెండాను తొలగించి దాని స్థానంలో జాతీయ జెండా ఎగురవేయాలని కోరాడనే... అతడిపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు చంద్రమోహన్ పక్కటెముక విరిగినప్పటికీ.. అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 
 
కుటుంబ సభ్యుల కథనం మేరకు... నూతన సంవత్సర వేడుకల సందర్భంగా.. డిసెంబరు 31వ తేదీ రాత్రి చీకలగురికి గ్రామ సచివాలయం ముందున్న వైసీపీ జెండాను తొలగించి, జాతీయ జెండా ఎగురవేయాలని టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ వైసీపీ కార్యకర్తలను కోరాడు. వారు ఒప్పుకోకపోవడంతో.. వైసీపీ జెండాను కిందకు దించకపోతే, తానే తొలగించి తగలబెట్టేస్తానని చంద్రమోహన్ అన్నాడు. దీంతో వారు చంద్రమోహన్‌తో వాగ్వాదానికి దిగారు. 
 
అనంతరం, తమ పార్టీ జెండాను తొలగించి తగలబెట్టాడని వైసీపీ కార్యకర్తలు పాల్తూరు పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో వారు జనవరి ఒకటో తేదీన చంద్రమోహన్‌‌‍ను అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు స్టేషన్‌కు తీసుకెళ్తున్నారంటూ అతడు ప్రశ్నించడంతో.. తమకే ఎదురు మాట్లాడతావా అంటూ పోలీసులు.. చంద్రమోహన్ దుస్తులు ఊడదీయించి, బూటు కాళ్లతో తంతూ, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. అంతటితో ఆగకుండా స్టేషన్ ప్రాంగణంలో నగ్నంగా తిప్పుతూ చితకబాదారు. అరెస్టు చూపి జైలుకు తరలించగా, 4వ తేదీన ఉరవకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రే‌ట్ బెయిల్ మంజూరు చేశారు. 
 
అయితే, పోలీసు దెబ్బలకు ఒళ్లంతా హూనమై.. ఆరోగ్యం క్షీణించడంతో అతడిని అదేరోజు కుటుంబ సభ్యులు ఉరవకొండ ఆస్పత్రిలో చేర్చారు. కాగా, పాల్తూరు పోలీసులు.. చంద్రమోహన్‌ను స్టేషన్ ప్రాంగణంలో నగ్నంగా తిప్పుతుండగా కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. తాము చంద్రమోహన్‌ను కొట్టలేదనీ, కేసు నమోదు చేసి జైలుకు పంపామని వివరణ ఇవ్వడం వారికే చెల్లింది.