శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2021 (09:53 IST)

నరసారావుపేటలో దారుణం.. డిగ్రీ విద్యార్థిని చంపేసిన ప్రేమోన్మాది

గుంటూరు జిల్లా నరసారావు పేటలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది కిరాతకుడిగా మారిపోయి, డిగ్రీ విద్యార్థిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బుధవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పట్టణంలోని కృష్ణవేణి డిగ్రీ కాలేజీలో కోటా అనూష(20) అనే యువతి బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ముప్పాళ్ళ మండలం గోళ్ళపాడుకు చెందిన అనూష రోజూ మాదిరిగానే ఇంటి నుంచి కళాశాల బస్సులో కాలేజీకి వచ్చింది. బస్సు దిగిన అనంతరం ఆమెను ప్రేమోన్మాది విష్ణువర్ధన్‌ రెడ్డి మాట్లాడాలని చెప్పి ఆటోలో ఎక్కించుకు వెళ్లినట్లు సహచార విద్యార్థులు చెబుతున్నారు. 
 
పట్టణ శివారులోని రావిపాడు సమీపంలోని పంట కాలువ వద్దకు తీసుకెళ్లి అనూష గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని కాలువ ఒడ్డున పడవేసి కనిపించకుండా చెత్త కప్పాడు. 
 
అనంతరం పోలీసుస్టేషన్‌కు వచ్చి తాను అనూషను హత్య చేశానని, మృతదేహం కాలువ వద్ద ఉందని పోలీసులకు తెలిపాడు. వెంటనే పోలీసులు  ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. ఇద్దరి సెల్‌ఫోన్లను పోలీసులు సీజ్‌ చేశారు.
 
కాగా, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్టు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో తనను నిర్లక్ష్యం చేస్తుందని భావించిన విష్ణు.. అనూషను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మాట్లాడాలని నమ్మించి తీసుకెళ్లి హత్య చేసినట్టు సమాచారం.