ఆదివారం, 8 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (15:03 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వర్షాలు-జగన్‌కు మోదీ ఫోన్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు గ్రామాలు, కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇళ్ళు నేలకొరిగాయి. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
 
మరోవైపు ఏపీ లోని వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడారు . రాష్ట్రంలో వరద పరిస్థితులపై ఆరా తీశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.
 
వరదల్లో చిక్కుకుని అనేక మంది గల్లంతయ్యారు. తాజాగా రాజంపేట వరదల్లో 12 మంది మృతి చెందగా, నందలూరు పరీవాహక ప్రాంతంలో 30 మంది చెయ్యేరు వరద ఉధృతిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరద ప్రభావిత జిల్లాల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
 
ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్ అధికారులకు సూచనలు సలహాలు అందిస్తున్నారు. ఇక మరోవైపు వరదల కారణంగా ఇప్పటికీ సికింద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళవలసిన పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు