1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (13:15 IST)

తితిదే బోర్డులో నేరచరితులా? ఏపీ హైకోర్టు ఆగ్రహం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో నేర చరితులను నియమించడం పట్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. 
 
నేరచరిత్ర ఉన్న వారిని నియమించిన వారికి నోటీసులివ్వాలని, దానిపై వివరణ తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవోకు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల్లోగా దీనిపై రిపోర్టు ఇవ్వాలని సర్కారుకు స్పష్టం చేసింది. 
 
మరోవైపు, తితిదే బోర్డులో పదుల సంఖ్యలో అయినవారికి, బడా పారిశ్రామికవేత్తలకు చోటు కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా, దీనికి హైకోర్టు మోకాలొడ్డింది. దీంతో చట్ట సవరణ ద్వారా తమ పనిని పూర్తి చేయాలన్న ఆలోచనలో ఏపీ సర్కారు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28వ తేదీన జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని సమాచారం.