శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (08:22 IST)

గెలిపిస్తే యేడాదిపాటు ఇంటింటికీ ఉచిత రేషన్ : బాండ్‌ పత్రంపై హామీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన తమ అభ్యర్థిని గెలిపిస్తే ఒకయేడాది పాటు ఉచితంగా ఇంటింటికీ రేషన్ ఇస్తానంటూ ఓ వ్యక్తి 20 రూపాయల బాండ్ పత్రంపై ప్రమాణ పత్రం రాసిచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక అనే గ్రామం వుంది. ఇది పెద్ద గ్రామమే. మొత్తం జనాభా 7,840. వారందరికీ ఏడాదిపాటు ఉచితంగా మినరల్‌ నీళ్లు. ఇక్కడ మొత్తం కుటుంబాలు 2,600. సంవత్సరంపాటు ఈ కుటుంబాలకు రేషన్‌ ఫ్రీ.... ఊబలంకలో మొత్తం గడప 1,884. ప్రతి ఇంటికీ ఉచితంగా ఏడాదిపాటు కేబుల్‌ ప్రసారాలు! 
 
ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచి పోస్టుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మేడిశెట్టి సురేఖ, 5వ వార్డు అభ్యర్థి కోనాల పేర్రెడ్డిలను గెలిపిస్తే, పై హామీలన్నీ అమలు చేస్తానని వారి తరపున పడాల రంగారెడ్డి ఓ బాండ్ పత్రం రాసి ఇచ్చారు. ఈ హామీలు రాసిన రూ.20 నోటరీ బాండును చూపిస్తూ.. ఓట్లు అడుగుతున్నారు. పనిలోపనిగా.. విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయమూ, బీపీ, షుగర్‌లకు ఉచిత పరీక్షలు చేస్తామని చెబుతున్నారు.
 
అలాగే, ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు పది మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పన ఇస్తామని హామీ ఇవ్వడంతో పాటు వీటిని రూ.20 బాండ్‌పై ముద్రించి నోటరీ చేయించి 14 బాండ్‌లను చేయించి 14 వార్డుల్లోని పెద్దలకు అందించారు.