బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మే 2020 (14:57 IST)

కరోనాకు కట్టడి.. వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పాఠాలు-ఏపీ సర్కారు

వాట్సాప్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు, సిలబస్‌ను వాట్సాప్ సహా ఇతరత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా విద్యార్ధులకు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో భాగంగా ప్రతీ పాఠశాలకూ ఓ 'వాట్సాప్ గ్రూప్'ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఒక పాఠశాలలోని విద్యార్ధులు, టీచర్లు... ఒక గ్రూపులో ఉంటారు. పదవ తరగతి పరీక్షల కోసం విద్యార్ధులకు అవసరమైన ప్రాక్టీస్ ప్రశ్నలను వాట్సాప్ మీడియా ద్వారా అందించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఇంకా ఆన్‌లైన్ ద్వారా తరగతులను నిర్వహించడం ద్వారా కరోనాను కట్టడి చేయడంతోపాటు విద్యార్ధులకు సమయం కూడా కలిసి వస్తుందని ఏపీ సర్కారు భావిస్తోంది. ఇదిలా ఉండగా ఇంటర్మీడియెట్ విద్యార్ధులకు కూడా ఇదే విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 
 
ఇక పదవ తరగతి ఆన్ లైన్ విద్యా విధానం ద్వారా మొత్తం పాతిక వేల మంది వరకు విద్యార్ధులు, మరో 933 మంది ఉపాధ్యాయులు ఈ వాట్సాప్ గ్రూపులో చేరాల్సి ఉంటుంది.

ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి ' యూట్యూబ్‌'లో అప్‌లోడ్ చేస్తారు. సంబంధిత 'యూఆర్‌ఎల్ లింక్'లను వాట్సాప్ గ్రూప్ లేదా 'ఈ-మెయిల్' ద్వారా విద్యార్ధులకు పంపుతారు.

ఆ వీడియోల ద్వారా విద్యార్ధులు తరగతులను ఫాలో కావాల్సి ఉంటుంది. అలాగే విద్యార్ధులు తాము తయారు చేసుకునే నోట్స్‌ను కూడా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఉపాధ్యాయులకు పంపాల్సి ఉంటుంది.