మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (08:32 IST)

విజయనగరం రైలు ప్రమాదం.. నేడు రద్దు చేసిన రైళ్ల వివరాలు..

train
ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది చనిపోయారు. ఈ ప్రమాదం కారణంగా సోమవారం అనేక రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఇలా రద్దు చేసిన రైళ్లలో రత్నాచల్, సింహాద్రి, చెన్నై సెంట్రల్ - పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్ళతో పాటు అనేక రైలు సర్వీసులు ఉన్నాయి. 
 
సోమవారం రద్దు అయిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే, విజయవాడ - విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం - విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, కాకినాడ - విశాఖపట్నం మెమూ ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం - కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌, రాజమండ్రి - విశాఖపట్నం మెమూ స్పెషల్‌, విశాఖపట్నం - రాజమండ్రి మెమూ స్పెషల్‌, గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్‌, కోరాపుట్‌ - విశాఖపట్నం స్పెషల్‌, విశాఖపట్నం - కోరాపుట్‌ స్పెషల్‌, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - పూరీ ఎక్స్‌ప్రెస్‌, రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, విశాఖపట్నం - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (ఇవాళ, రేపు రద్దు)లు ఉన్నాయి. 
 
మరోవైపు, రెండు రైళ్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తవలస మండలంలో రైలు ప్రమాదం జరిగిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి సంఘటన స్థలి వద్దకు వీలైనన్ని అంబులెన్స్‌లు పంపించాలని స్పష్టంచేశారు. ఘటన స్థలికి సమీపంలోని ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
 
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.