గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 అక్టోబరు 2023 (11:52 IST)

చంద్రబాబు కేసు పిటిషన్లు కేసులు విచారించే న్యాయమూర్తులు వీరే...

chandrababu naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు విచారించే కేసులకు సంబంధించిన సబ్జెక్టులను (రోస్టర్) మారుస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల ఏపీ హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు చేరారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ రోస్టల్‌లో మార్పులు చేస్తూ శనివారం ఉత్తర్వులిచ్చారు. 
 
అన్ని బెయిలు పిటిషన్లు, 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విచారణను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు కేటాయించారు. దీంతో స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిలు పిటిషన్, మధ్యంతర బెయిలు కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ మల్లికార్జునరావు వద్ద సోమవారం విచారణ జాబితాలోకి వచ్చాయి. 
 
మరోవైపు తాజాగా జారీచేసిన రోస్టర్లో జస్టిస్ బీఎస్ భానుమతికి హోంశాఖకు చెందిన ఎఫ్ఎస్ఐఆర్/ఛార్జిషీట్ల క్వాష్ పిటిషన్లను అప్పగించారు. ఎఫ్ఎర్లను కొట్టివేయాలంటూ 2022 నుంచి దాఖలైన పిటిషన్లపై ఆమె విచారించనున్నారు.
 
హైకోర్టు జడ్జిగా తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌కు సింగిల్ బెంచ్ కేటాయించారు. ఏసీబీ, సీబీఐ కేసుల విషయంలో (సర్వీసు విషయాలు సహా) 2014 వరకు నమోదైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు.
 
తాజా జడ్జిలు మరో ముగ్గురు.. సీనియర్ జడ్జిలతో కలిసి డివిజన్ బెంచ్ పంచుకునేలా రోస్టర్ నిర్ణయించారు. జస్టిస్ ఏవీ శేషసాయితో జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ యు. దుర్గాప్రసాదరావుతో జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథాయ్లో జస్టిస్ న్యాపతి విజయ్ డివిజన్ బెంచ్‌లో కేసులను విచారిస్తారు. 
 
ఇప్పటివరకు బెయిల్ పిటిషన్‌లపై విచారణ జరిపిన జస్టిస్ కె.సురేశ్ రెడ్డికి.. ఎఫ్ఎస్ఐఆర్, అభియోగపత్రాలను కొట్టేయాలంటూ 2017 వరకు దాఖలైన పిటిషన్లను విచారించే బాధ్యతను అప్పగించారు. 2018 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్ల విచారణను కేటాయించారు. 
 
అలాగే, ఇప్పటివరకు ఎఫ్ఎస్ఐఆర్ కొట్టివేత పిటిషన్లపై విచారణ చేసిన జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డికి.. ఒరిజినల్ సివిల్ దావాలు, ఒరిజినల్ పిటిషన్లు, వాణిజ్య సంబంధ కేసులు, కంపెనీ అప్లికేషన్లు, కంపెనీ పిటిషన్లు, 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, తదితర సబ్జెక్టులను విచారించే బాధ్యతను అప్పగించారు.