1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 మే 2023 (15:06 IST)

కర్నాటక ఫలితంతో వణికిపోతున్న ఏపీ బీజేపీ నేతలు

bjp flags
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలకు కర్నాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏమాత్రం మింగుడుపడటం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో వారు డీలాపడి పోయారు. ముఖ్యంగా కర్ణాటకలో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో బీజేపీ ఓడిపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ వ్యూహాన్ని మార్చుకోకపోతే ఏపీలో కనిపించకుండా పోతామన్న అభిప్రాయం సీనియర్ క్రియాశీల కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఒకరిద్దరైనా బీజేపీకి ప్రజా ప్రతినిధులు ఉండగా మన రాష్ట్రంలో ఒక్కరు కూడా లేరు. గత ఎన్నికల్లో నోటా కన్నా బీజేపీకి తక్కువ ఓట్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఇదే. ఆ తర్వాత రాష్ట్రంలో జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ డిపాజిట్లను కూడా దక్కించుకోలేక పోయింది. 
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు ఉనికే లేదు. ఇటువంటి రాష్ట్రంలో కొంతైనా పార్టీ మొలకెత్తాలంటే వ్యూహం మార్చి పొత్తులకు వెళ్లాల్సిందేనని కేడర్ నుంచి వినిపిస్తోంది. పొత్తులపై పవన్ కల్యాణ్ విస్పష్ట ప్రకటన తర్వాత.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడితే కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు దక్కించుకోవచ్చని ఆది నుంచీ పార్టీ జెండా మోస్తున్న క్రియాశీల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. 
 
పాలక వైసీపీపై ప్రజల్లో రోజు రోజుకూ వ్యతిరేకత ఎక్కువ అవుతుండటంతో ఇక రూటు మార్చాల్సిందేనని అంటున్నారు. కర్ణాటకలో అవినీతి వల్లే బీజేపీ ఓడింది. ఏపీలో మొత్తం వనరుల్ని దోచేస్తూ అరాచకాలు సృష్టిస్తోన్న జగనన్ను ఉపేక్షిస్తే బీజేపీకి దెబ్బపడదా? అవినీతి విషయంలో దక్షిణాది ప్రజలు ఎవరినీ ఉపేక్షించరని ఈ ఫలితాలతో తేటతెల్లం చేశారు. వాగుల్లో ఇసుక నుంచి దేన్నీ వదలకుండా దోచేస్తున్న వైసీపీతో దోస్తీ కొనసాగితే ముప్పు తప్పదు అని ఆ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు, కిందిస్థాయి కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.