1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , గురువారం, 6 జనవరి 2022 (12:51 IST)

ఫిట్‌మెంట్‌ ఎంత? భారమెంత? ఉద్యోగుల పీఆర్‌సీపై సీఎం సమీక్ష

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉగ్యోగుల పి.ఆర్.సి. వ్య‌వ‌హారం ప్ర‌భుత్వం మెడ‌కు త‌ల‌నొప్పి వ్య‌వ‌హారంలా చుట్టుకుంది. త‌మ‌ని సీఎంను క‌ల‌వ‌నీయకుండా అడ్డుకుంటున్నార‌ని ఎన్జీవో నేత‌లు ఆరోపిస్తున్న నేప‌థ్యంలో నేడు సీఎం జ‌గ‌న్ వారిని క‌లువ‌నున్నారు. 
 
 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్ త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌తో సుదీర్ఘంగా చర్చించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యోగులకు పీఆర్సీ, సీపీఎస్‌ రద్దు సహా మిగిలిన డిమాండ్ల పరిష్కారంపై సమగ్రంగా చర్చించారు. ఉద్యోగులకు ఎంతమేర ఫిట్‌మెంట్‌ ఇవ్వాలనే అంశంపై సమాలోచనలు చేశారు. 14.29 శాతం పైన ఎంతశాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే అంశంపై సీఎంకు ఆర్థికశాఖ అధికారులు నివేదిక ఇచ్చారు. 
 
 
నేడు ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు జరిపే స‌మ‌యంలో ఫిట్‌మెంట్ ఖరారు చేయనున్నారు. చర్చల‌కు అందుబాటులో ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలకు ముఖ్యమంత్రి  కార్యాలయ వర్గాలు సమాచారమిచ్చాయి. దీనితో సీఎంతో ఉద్యోగ సంఘాల నేతల భేటీకి నేడు ఖరార‌ని చెపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇందులో 16 సంఘాల నాయకులతో క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నారు. వీరితో చ‌ర్చించిన త‌ర్వాత పీఆర్సీ పై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.