1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 డిశెంబరు 2019 (11:39 IST)

కుంటిసాకులు వద్దు.. జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయండి : గౌతం సవాంగ్ ఆదేశం

హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు తర్వాత జీరో ఎఫ్ఐఆర్ తెరపైకి వచ్చింది. అసలు ఇలాంటి ఎఫ్ఐఆర్ ఒకటుందనే విషయం చాలా మందికి తెలియదు. దిశ అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె తల్లిదండ్రులు వెళ్ళగా, పోలీసులు అనుసరించిన వైఖరితో ఇపుడు జీరో ఎఫ్ఐఆర్ అంశం తెరపైకి వచ్చింది. 
 
అసలు జీరో ఎఫ్ఐఆర్ అంటే.. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా... పీఎస్ వచ్చిన బాధితులన ఫిర్యాదలను స్వీకరించడమే జీరో ఎఫ్ఐఆర్. ఈ తాజాగా, ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేశారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు కుంటి సాకులు చెప్పకుండా... జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. 
 
బాధితులు అత్యవసర పరిస్థితుల్లో రక్షణ, న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వస్తుంటారని... సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేస్తుంటారని... అయితే, మీ ప్రాతం మా పరిధిలోకి రాదంటూ ఫిర్యాదులను స్వీకరించడానికి పోలీసులు నిరాకరిస్తుంటారని ఆయన అన్నారు.
 
తమ నివాసం ఏ పరిధిలోకి వస్తుందో తెలుసుకుని, బాధితులు అక్కడకు వెళ్లే లోపల జరగాల్సిన ఘోరాలు జరిగిపోతుంటాయని గౌతమ్ సవాంగ్ చెప్పారు. బాధితులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. 
 
జీరో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడానికి నిరాకరించేవారు ప్రాసిక్యూషన్‌కు అర్హులవుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్‌లను అమలు చేస్తామని... వారం రోజుల్లో దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ సిద్ధం చేస్తామని తెలిపారు. పోలీసులు వాడుతున్న భాష సరిగా లేదనే ఫిర్యాదులు ఇప్పటికీ వస్తున్నాయని... స్పందన కార్యక్రమంతో కొంత మార్పు వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడించారు.