ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (18:12 IST)

దళారీలు, మిల్లర్ల ప్రమేయం లేకుండా సింగిల్ విండోలో ధాన్యం సేకరణ

ద‌ళారులు, మిల్ల‌ర్లు ప్ర‌మేయం లేకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సింగిల్ విండో ద్వారా ధాన్యం సేక‌రిస్తుంద‌ని కృష్ణా జిల్లా జాయింట్  కలెక్టర్ (రెవిన్యూ )డాక్టర్ కే.మాధవి లత చెప్పారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా  అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, 2021 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ విధి విధానాలు వివరించారు.

 
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో 189 మిల్లులు ఉన్నాయని, తూకాలలో ఎలాంటి తేడాలు రాకుండా ప్రతి మిల్లు వద్ద వీఆర్వోకు విధులు కేటాయించామని తెలిపారు. 8 నుండి 10 మిల్లులకు ఒకరిని సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ను పెట్టామని, మండల ప్రోక్యూర్మెంట్ అధికారిగా తాసిల్దార్ నియమించినట్లు జెసి తెలిపారు. జిల్లాలో 135 మిల్లుల నుండి సార్టెక్స బియ్యం సేకరిస్తున్నట్లు, మిగతా 54 నాన్ సార్టెక్స్ మిల్లుల నుండి ఎఫ్ సి ఐ కి బియ్యం సరఫరా ఇస్తున్నట్లు తెలిపారు. దళారులు మిల్లర్ల ప్రమేయం లేకుండా ఈ ఏడాది ధాన్యం సేకరణకు కు సింగిల్ విండో  విధానం అమలు చేస్తున్నట్లు జేసీ పేర్కొన్నారు. 
 

క్షేత్రస్థాయిలో ధాన్యం సేకరణలో రైతుల ఇబ్బందులను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకు రావాలని, ఈ విధానంలో ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తామని, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులకు జాయింట్ కలెక్టర్ సూచించారు. మొదటి 15 రోజులు అప్రమత్తంగా ఉంటే ఈ సీజన్ సక్సెస్ అవుతుందని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు చేర్చేందుకు రవాణాకు కాం ట్రాక్టర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 
ఈనెల 18 తర్వాత ఒకేసారి క్రాఫ్ట్ కటింగ్ కు రావచ్చని కూలీల సమస్య ఏర్పడవచ్చు వర్షాలు ఎక్కువగా పడుతున్నందున ధాన్యం రంగు మారే అవకాశాలు ఉన్నాయని, నిబంధనల మేరకు తేమశాతం ఉండాలంటే ధాన్యం ఆర పెట్టుకోవాల్సిన అవసరం ఉందని, రైతులు నష్టపోకుండా తేమ శాతంలో వెసులుబాటు కల్పిస్తే  బాగుంటుందని, ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సభ్యులు జాయింట్ కలెక్టర్ కు తెలియజేశారు.