శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (12:53 IST)

కొత్త జిల్లాల ప్రకటనపై వెనక్కి తగ్గిన సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త జిల్లాల ఆవిర్భావంపై ఉగాది రోజైన ఏప్రిల్ 2వ తేదీన ప్రకటన చేస్తామని తొలుత ప్రకటించింది. దీంతో ఉగాది రోజున సెలవును కూడా రద్దు చేసింది. ఇంతలో ఏమైందో ఏమోగానీ, ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా, వాటిని లోక్‌సభ ప్రాతిపదికగా 26 జిల్లాలను ఏర్పాటు చేసింది. వాస్తవానికి 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సివుంది. కానీ, అరకు లోక్‌సభను రెండు జిల్లాలుగా చేశారు. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరింది. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదముద్ర వేసింది. 
 
ఆ తర్వాత ఈ కొత్త జిల్లాల ఆవిర్భావంపై ఒక అధికారిక ప్రకటనను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. అందుకోసం భారీ వేడుకను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉగాది రోజున కొత్త జిల్లాల ప్రకటన రానున్న నేపథ్యంలో ఏప్రిల్ 2న ఉగాది సెలవును కూడా రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 
 
అయితే, జిల్లాల ఆవిర్భావ ప్రకటన వాయిదాపడటంతో యాధావిధిగా ఉగాది సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ 4వ తేదీ సోమవారం ఈ కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆవిర్భావ ప్రకటన చేసే అవకాశం ఉంది.