1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2023 (10:41 IST)

తితిదే సభ్యుల నియామకంపై వివరాలు కోరిన హైకోర్టు

tirumala
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈ ముగ్గురి తితిదే పాలక మండలి నుంచి తొలగించాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... తితిదే పాలక మండలి సభ్యుల నియామకానికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని కోరారు. 
 
తితిదేకు ఇటీవల కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించగా, అలాగే సభ్యులుగా అనేక మందిని నియమించింది. వీరిలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న జగ్గయ్యపేట వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు, అరబిందో గ్రూపు డైరెక్టర్ శరత్‌ చంద్రారెడ్డి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌గా ఉద్వాసనకు గురైన డాక్టర్ కేతన్ దేశాయ్‌లు కూడా ఉన్నారు.
 
ఈ ముగ్గురి నియామకాన్ని వ్యతిరేకిస్తూ, దాఖలైన వ్యాజ్యం బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, తితిదేని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఆర్ రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. 
 
క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న‌ పైన పేర్కొన్న వారిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు సభ్యులుగా నియమిస్తూ ఈ ఏడాది ఆగస్టు 25న ప్రభుత్వం ఇచ్చిన జీవో 406ను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేశారు. వీరి నియామకం దేవదాయ చట్టంలోని సెక్షన్ 18, 19కి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. వీరి విషయంలో జీవో అమలును నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. ఈ పిల్ బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.